రండి.. హైదరాబాద్‌ను అభివృద్ధి చేద్దాం: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Calls For Development Of Hyderabad | Sakshi
Sakshi News home page

రండి.. హైదరాబాద్‌ను అభివృద్ధి చేద్దాం: సీఎం రేవంత్‌

Sep 8 2025 7:18 PM | Updated on Sep 8 2025 8:00 PM

CM Revanth Reddy Calls For Development Of Hyderabad

హైదరాబాద్:  ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధికి అందరూ కలిసి రావాలని రేవంత్‌ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌ను డిసెంబర్‌ 9వ తేదీన తెలంగాణ సమాజానికి అంకితం ఇవ్వబోతున్నామన్నారు సీఎం రేవంత్‌.  ఎవరెన్ని కుట్రలు చేసినా తమ ప్రభుత్వం తిప్పికొడుతుందన్నారు సీఎం రేవంత్‌.  ఇది ఇందిరమ్మ రాజ్యమని,  ఈ రాజ్యంలో పేదోళ్లకు న్యాయం జరుగుతుందన్నారు.  గోదావరి ఫేజ్ 2&3  శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లడారు. గంగా నదీ, యమునా, సబర్మతీ నదులు ప్రక్షాళన చేయొచ్చని, కానీ తాము మూసీని ప్రక్షాళన చయొద్దా? అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు ఎందుకు మూసీ నది ప్రక్షాళన చేపట్టలేదని నిలదీశారు. 

‘1908 లో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించి నిజాం ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలను వరదల నుంచి కాపాడింది. వందేళ్లకు పైగా ఈ నగరానికి తాగు నీరు అందుతున్నాయంటే ఆనాటి నిజాం సర్కార్ దూరదృష్టినే కారణం. కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంతో కృషి చేశాయి. 1965 లో మంజీరా నది నుంచి నగరానికి తాగు నీరు అందించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. 2002 లో కృష్ణా నదీ జలాలను మూడు దశల్లో నగరానికి తరలించి ప్రజల దాహార్తిని తీర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలది. కాంగ్రెస్ తెచ్చిన గోదావరి జలాలను నెత్తి మీద చల్లుకుని తామే ఏదో చేసినట్టు కొందరు నమ్మించారు. 

నెత్తిమీద నీళ్లు చల్లుకున్నంత మాత్రాన వాళ్ల పాపాలు తొలగిపోవు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాతే గోదావరి జలాల తరలింపునకు ముందడుగు పడింది. కాలుష్యమయమైన మూసీతో నల్లగొండ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషతుల్యమైన మూసీని ప్రక్షాళన చేస్తానని నల్లగొండ జిల్లా ప్రజలకు ఆనాడే మాట ఇచ్చా. 20 టీఎంసీల గోదావరి జలాలను హైదరాబాద్‌కు తరలించబోతున్నాం. 

ఇందులో 16 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి కోసం వినియోగించబోతున్నాం. చెరువులను నింపుకుంటూ 4 టీఎంసీలను మూసీకి తరలించి మూసీని ప్రక్షాళన చేస్తాం. శ్రీపాద ఎల్లంపల్లి నుంచే గోదావరి జలాలను హైదరాబాద్ తరలిస్తున్నాం. ఆ సంగతి మరిచిపోయి కొందరు మల్లన్నసాగర్ అని మాట్లాడుతున్నారు. చేవెళ్లలో వైఎస్ ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాసుల కక్కుర్తితో తలను తొలగించింది మీరు కాదా?, చేవెళ్ల, తాండూరు, పరిగికి సాగునీరు అందకపోవడానికి కారణం మీరు కాదా?, తుమ్మిడిహెట్టీ దగ్గర ప్రాణహిత చేవెళ్ల కట్టి ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల రైతులకు సాగునీరు అందిస్తాం’ అని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement