హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి సీఐడీ విచారణ ముగిసింది. కరీంనగర్ సీపీపై అభ్యంతరకర వ్యాఖ్యలు, పోలీస్ విధులకు ఆటంకం కల్గించారనే ఆరోపణలపై కౌశిక్రెడ్డిని సీఐడీ విచారించింది. దీనిలో భాగంగా విచారణ అనంతరం ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, సీపీ మతమార్పిడి చేస్తున్నారని తాను అనలేదని, ఆధారలన్నీ సీఐడీకి ఇచ్చానని, మళ్లీ ఎప్పుడు పిలిచినా వెళ్తానన్నారు.
తనపై విచారణ చేయడం కాదని, సీపీ ఇల్లీగల్ దందాలపై విచారణ చేయాలన్నారు కౌశిక్రెడ్డి.‘కౌశిక్ రెడ్డి కుటుంబంపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. హుజురాబాద్ లో డంపింగ్ యార్డు ఎందుకు పెట్టారు?, కరీంనగర్, వరంగల్ నుంచి చెత్త తీసుకొచ్చి హుజురాబాద్ లో ఎలా వేస్తారు. కౌశిక్ రెడ్డి దీక్షకు కూర్చుంటాడని సీఐడీ నోటీస్లు ఇచ్చారు.
నా మీద కోపం ఉంటే ఊరేయండి...హుజురాబాద్ మీద కక్ష ఎందుకు?, డంపింగ్ యార్డు రద్దు చేయకపోతే 7 వ తారీఖు నుంచి 8 వ తారీఖు వరకు దీక్షకు కూర్చుంట. నాపై వేసిన కేసు పోలీసులకే ఉచ్చు బిగిస్తుంది. ఈ కేసుకు సీఐడీకి ఏం సంబంధం.కరీంనగర్ పోలీస్ కమిషనర్ మత మార్పిడి చేస్తున్నాడని నేను అనలేదు. అలా అన్నానని ఒక్క వీడియో అయినా చూపించగలరా?, చూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా’ అని తెలిపారు.


