ఇంద్రావతికి కట్టడి! | Chhattisgarh ready for maximum utilization of Godavari tributary waters | Sakshi
Sakshi News home page

ఇంద్రావతికి కట్టడి!

Jun 21 2025 1:30 AM | Updated on Jun 21 2025 1:29 AM

Chhattisgarh ready for maximum utilization of Godavari tributary waters

గోదావరి ఉపనది జలాల గరిష్ట వినియోగానికి ఛత్తీస్‌గఢ్‌ రెడీ

బోద్‌ఘాట్‌ బహుళార్థక సాధక ప్రాజెక్టుకు శ్రీకారం..కేంద్రం అనుమతి!

తెలంగాణ ప్రాజెక్టులకు నీటి లభ్యత కష్టమే అంటున్న నిపుణులు 

గోదావరిలో ఇంద్రావతి కలిసే ప్రాంతానికి దిగువనే దేవాదుల, సీతారామ, సమ్మక్క–సారక్క 

వీటికి దిగువన ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 

గోదావరికి ప్రాణహిత తర్వాత ఇంద్రావతే ప్రధాన వనరుగా ఉన్న వైనం 

ఈ నదిలో ఏటా సుమారు 600–800 టీఎంసీల మేర లభ్యత 

రూ.49 వేల కోట్లతో సుమారు 9.45 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా ఛత్తీస్‌గఢ్‌ ప్రణాళికలు

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు జీవనాడిగా ఉన్న గోదావరి నదికి ప్రాణహిత తర్వాత ప్రధాన ఉప నది అయిన ఇంద్రావతి నీటిని పూర్తిగా కట్టడి చేసేలా ఛత్తీస్‌గఢ్‌ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇంద్రావతిలో లభ్యతగా ఉన్న నీటిలో మెజా రిటీ జలాలను వినియోగించుకునేలా బోద్‌ఘాట్‌ బహుళార్థక సాధక ప్రాజెక్టుకు అంకురార్పణ చేస్తోంది. ఇటీవలే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సైతం అనుమతినిచ్చిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయి ప్రకటించారు. 

ఇంద్రావతి నీటినే నమ్ముకొని తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టులు చేపడుతుండటం గమనార్హం. కాగా ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ తెరపైకి తెచ్చిన ఈ ప్రాజెక్టుతో దిగువ గోదావరిలో జలాల లభ్యత తగ్గిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌ వినియోగించని జలాలనే ఆధారంగా చేసుకుని కేంద్రం గోదావరి–కావేరి అనుసంధానాన్ని తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. 

ఎగువ నీళ్లకు ఎగువనే అడ్డుకట్ట.. 
ఇంద్రావతిలో ప్రతి ఏటా సుమారు 600–800 టీఎంసీల మేర లభ్యత ఉంటుందని కేంద్రం లెక్కలు చెబుతున్నాయి. ఇది ఛత్తీస్‌గఢ్‌లో 264 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మేడిగడ్డ దిగువన, సమ్మక్క–సారక్క బరాజ్‌ ఎగువన గోదావరిలో కలుస్తుంది. దంతెవాడ, బీజాపూర్, సుక్మా, బస్తర్, కాంకేర్‌ జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఆయా జిల్లాలన్నీ తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుల్లోనే ఉన్నాయి. 

ఇంద్రావతి నీళ్లు కలిశాకే గోదావరి దిగువన ప్రవాహాలు మరింత ఉధృతంగా ఉంటాయి. కాగా ఇంద్రావతి నది గోదావరిలో కలిసే ప్రాంతానికి దిగువన, గరిష్ట నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ.. దేవాదుల (38 టీఎంసీలు), సీతారామ (70 టీఎంసీలు), సమ్మక్క–సారక్క (50 టీఎంసీలు మొత్తంగా 158 టీఎంసీలు) ప్రాజెక్టులు చేపట్టింది. ఇక ఏపీలో పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. 

ఇలావుండగా ఇంద్రావతిలో లభ్యత నీటిని ఛత్తీస్‌గఢ్‌ పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక పోవడంతో.. ఈ నీటిని మిగులు జలాలుగా గుర్తించిన కేంద్రం.. నదుల అనుసంధాన ప్రతిపాదనలు చేసింది. ఇంద్రావతి బేసిన్‌లో ఛత్తీస్‌గఢ్‌ (అప్పటి మధ్యప్రదేశ్‌)కు గోదావరి ట్రిబ్యునల్‌ కేటాయించిన నీటిలో వాడుకోని 141.4 టీఎంసీలకు మరో 106 టీఎంసీల వరద జలాలను జతచేసి మొత్తం 247 టీఎంసీలను ఇచ్చంపల్లి–నాగార్జునసాగర్‌–సోమశిల మీదుగా కావేరి గ్రాండ్‌ ఆనకట్ట వరకు తరలించేలా నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) తొలుత ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 

అయితే గోదావరిలో మిగులు, వరద జలాల నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చేవరకు అనుసంధానం పక్కన పెట్టాలని తెలంగాణ, ఏపీలు డిమాండ్‌ చేస్తూ వచ్చాయి. దీంతో తొలిదశ కింద ఛత్తీస్‌గఢ్‌ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలనే గోదావరి–కావేరి అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి నుంచి నీటిని తరలించేలా ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఆవిరి, ప్రవాహ నష్టాలు పోను ఏపీకి 41.8, తెలంగాణకు 42.6, తమిళనాడు 38.6, పుదుచ్చేరికి 2.2, కర్ణాటకకు 9.8 టీఎంసీలు ప్రతిపాదించింది. దీనిపై ఛత్తీస్‌గఢ్‌ సర్కార్‌ తీవ్ర అభ్యంతరం తెలిపింది.  

చెప్పినట్టే చేస్తున్న ఛత్తీస్‌గఢ్‌ 
తమకు హక్కుగా సంక్రమించిన నీటిని తరలించుకు పోతామంటే ఒప్పుకునేది లేదని, భవిష్యత్తులో ఈ నీటిని వినియోగించుకునేలా తాము ప్రాజెక్టులు చేపడతామని ఛత్తీస్‌గఢ్‌ తెగేసి చెప్పింది. ఈ క్రమంలోనే ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం బోద్‌ఘాట్‌ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రం ముందుంచింది. 

ఈ ప్రాజెక్టు కింద ఇందావ్రతి నీటిని ఒడిసిపట్టేలా రూ.29 వేల కోట్లతో బోద్‌ఘాట్‌ ఆనకట్టని, అదనంగా మరో రూ.20 వేల కోట్లతో మహానది–ఇంద్రావతి లింక్‌ను చేపట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 300 మెగావాట్ల విద్యుదుత్పత్తితో పాటు దంతెవాడ, సుక్మా, బీజాపూర్‌ జిల్లాల్లోని 359 గ్రామాల పరిధిలోని 3.78 లక్షల హెక్టార్లకు (9.45 లక్షల ఎకరాలకు) సాగునీటిని అందించాలని నిర్ణయించింది. అదనంగా తాగు, పారిశ్రామిక అవసరాలకు నీటిని ఇచ్చేలా ప్రణాళికలు ఉన్నాయి.  

గోదావరి–కావేరి అనుసంధానం కూడా ప్రశ్నార్థకమే..! 
ఇంద్రావతి మెజారిటీ జలాలను ఛత్తీస్‌గఢ్‌ వినియోగించుకునే పక్షంలో గోదావరి నుంచి తెలంగాణ, ఏపీ ప్రాజెక్టులకు నీటి లభ్యత తగ్గడం ఖాయమని నీటి పారుదల నిపుణులు అంటున్నారు. అలాగే కేంద్రం ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధానం కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని చెబుతున్నారు. కాగా దీనిపై తెలుగు రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement