సాక్షి, హైదరాబాద్: వాహనాలు నడిపేటప్పుడు సెల్ ఫోన్ ఉపయోగించడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను అరికట్టడానికి, రహదారి భద్రతను మెరుగుపరచడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 03.04.2026 నుండి 09.04.2026 వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. డ్రైవింగ్ సమయంలో ఏకాగ్రత లోపించడం వల్ల జరిగే ప్రమాదాలను నివారించడం మరియు వాహనదారులలో క్రమశిక్షణను పెంపొందించడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని తెలిపారు
గడిచిన వారం రోజుల్లో నిర్వహించిన తనిఖీలలో, డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ వాడుతున్న 6,046 మంది నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించి, వారిపై కేసులు నమోదు చేశారు. వీరిలో అధికంగా ద్విచక్ర వాహనదారులు 5,810 మంది, ఆటో/త్రీ వీలర్ డ్రైవర్లు 51 మంది, కార్లు మరియు ఇతర వాహనదారులు 185 మంది ఉన్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్బంగా హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ..వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడటం అనేది రహదారి భద్రతను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదకరమైన నేరం. దీనివల్ల డ్రైవర్ దృష్టి పక్కదారి పడుతుంది. ఒక్క క్షణం పాటు దృష్టి మళ్లినా, అది వాహనదారుడితో పాటు ఇతర ప్రయాణికులకు మరియు పాదచారుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారందరిపై చార్జ్షీట్లు దాఖలు చేసి, గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామని చట్టప్రకారం జరిమానాలు విధిస్తామని పేర్కొన్నారు.


