సాక్షి, సూర్యాపేట: నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. సూర్యాపేట మండలం యర్కారంలో మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ చింతలపాటి మధు దారుణ హత్యకు గురయ్యారు. మూడు ముక్కలుగా నరికి మూడు గోనెసంచుల్లో కట్టి గ్రామ సమీపంలోని ఎస్సారెస్పీ కాలువలో పడేశారు. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
వివరాల మేరకు.. రాజకీయ హత్యలకు యర్కారం కేరాఫ్ అడ్రస్గా మారింది. కొన్నేళ్ల క్రితం అప్పటి సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య కేసులో చింతలపాటి మధు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, యర్కారంలో హత్యకు గురైన మధు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు . ఆయన భార్య మౌనిక యర్కారం మాజీ సర్పంచ్. మధును హత్య చేసింది కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లేనని మౌనిక ఆరోపిస్తున్నారు. తన భర్తను మిద్దె రవీందర్ కుమారుడితో పాటు మరో 15 మంది కలిసి హత్య చేసినట్టు చెబుతున్నారు.
ఇదిగా ఉండగా.. సూర్యాపేట ప్రాంతంలో ఫ్యాక్షన్ గ్రామంగా యర్కారానికి పేరు. గ్రామంలో 1985 నుంచి ఇప్పటి వరకు హత్యకు గురైన వివిధ పార్టీలకు చెందిన తొమ్మిది మంది నాయకులు ఉన్నారు. తాజాగా హత్యకు గురైన చింతలపాటి మధు గతంలో జరిగిన ఒంటెద్దు వెంకన్న హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నాడు. 2004లో జరిగిన మిద్దె రవీందర్ హత్య కేసులో నిందితుడు. నిన్న రాత్రి 11-12 గంటల ప్రాంతంలో మధు హత్య జరిగింది. అత్యంత దారుణంగా కత్తులు, గొడ్డళ్లు, వేట కొడవళ్లతో దుండగులు నరికి చంపారు. ముఖం గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. హత్య అనంతరం గోనె సంచుల్లో కుక్కి మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేశారు.


