హైదరాబాద్‌–బెంగళూరు.. డిఫెన్స్‌ కారిడార్‌! | Brahmos missile manufacturing Corridor construction in Palamuru | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌–బెంగళూరు.. డిఫెన్స్‌ కారిడార్‌!

Jun 23 2025 5:52 AM | Updated on Jun 23 2025 5:52 AM

Brahmos missile manufacturing Corridor construction in Palamuru

పాలమూరులో బ్రహ్మోస్‌ క్షిపణి తయారీ కేంద్రానికి అడుగులు 

దేవరకద్రలోని చౌదర్‌పల్లి–బస్వాయిపల్లి మధ్య 497 ఎకరాల భూమి లభ్యత 

డీఆర్‌డీఎల్‌ శాస్త్రవేత్తల స్థల పరిశీలన.. అనుకూలంగా ఉందని వెల్లడి 

యూనిట్‌ ఏర్పాటైతే క్షిపణి విడిభాగాల తయారీ పరిశ్రమలకూ అవకాశం 

ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 10 వేల మంది స్థానికులకు ఉపాధి

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: తెలంగాణలో డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. దేశంలో ఇప్పటివరకు రెండు డిఫెన్స్‌ కారిడార్లు (తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌) ఉన్నాయి. రెండో కారిడార్‌కు సంబంధించి గతంలోనే రాష్ట్రానికి అవకాశం వచ్చినా చివరలో యూపీకి తరలిపోయింది. 

తాజాగా మూడో కారిడార్‌ను తెలంగాణలో ఏర్పాటు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాలమూరులో బ్రహ్మోస్‌ క్షిపణి తయారీ యూనిట్‌ ద్వారా హైదరాబాద్‌–బెంగళూరు డిఫెన్స్‌ కారిడార్‌కు మార్గం సుగమమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 

దేవరకద్రలో ‘బ్రహ్మోస్‌’యూనిట్‌ ఏర్పాటుతో.. 
బ్రహ్మోస్‌ క్షిపణి తయారీ కేంద్రం హైదరాబాద్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ యూనిట్‌ను విస్తరించాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నా అక్కడ భారీగా భూములు అందుబాటులో లేవు. బ్రహ్మోస్‌ క్షిపణి తయారీ యూనిట్‌కు సుమారు 350 నుంచి 400 ఎకరాల వరకు స్థలం అవసరమవగా అందుకోసం అన్వేషణ కొనసాగుతోంది. 

సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో డిఫెన్స్‌ రీసెర్చ్, డెవలప్‌మెంట్‌ లేబొరేటరీ (డీఆర్‌డీఎల్‌), బ్రహ్మోస్‌ శాస్త్రవేత్తల బృందం ఇటీవల ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని భూములను పరిశీలించింది. దీంతో బ్రహ్మోస్‌ క్షిపణి తయారీ యూనిట్‌తోపాటు హైదరాబాద్‌–బెంగళూరు డిఫెన్స్‌ కారిడార్‌ ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. 

అంతా సానుకూలత.. 
మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని చౌదర్‌పల్లి–బస్వాయిపల్లి మధ్య గతంలో విమానాశ్రయం కోసం ప్రణాళికలు రూపొందించారు. ఆ మ్యాప్‌ ప్రకారం 150 ఎకరాల మేర ప్రభుత్వ భూమి లభ్యమవగా మరో 150 ఎకరాల మేర ఆసైన్డ్‌ భూములు ఉన్నాయి. 197 ఎకరాల వరకు రైతుల నుంచి సేకరించాలని అధికారులు అప్పట్లో నిర్ణయించారు. 

డీఆర్‌డీఎల్‌ డైరెక్టర్‌ జీఏ శ్రీనివాసమూర్తి, జనరల్‌ ఆఫ్‌ బ్రహ్మోస్‌ డైరెక్టర్‌ జైతీర్థ్‌ జోషి, బ్రహ్మోస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎస్‌.సాంబశివప్రసాద్‌ ఇటీవల చౌదర్‌పల్లి–బస్వాయిపల్లి మధ్య స్థలాన్ని పరిశీలించారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి, తహసీల్దార్లు అక్కడ 497 ఎకరాల వరకు భూమి లభ్యత ఉందని మ్యాప్‌ ఆధారంగా వివరించారు. 

రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 200 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని ఉచితంగా ఇస్తామని రాష్ట్ర పెద్దలు శాస్త్రవేత్తల బృందానికి వెల్లడించారు. మిగతా 200 ఎకరాలను కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో సేకరించి ఇస్తామని.. దీనికి సంబంధించి పరిహారం మాత్రం కేంద్రం భరించేలా ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. జాతీయ రహదారులు 167, 44కు మధ్య ఈ భూములు ఉండటం.. అటు హైదరాబాద్, ఇటు బెంగళూరుకు రైలు, విమాన మార్గాల కనెక్టివిటీ ఉండటంతో శాస్త్రవేత్తల బృందం అందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement