మేం ఉండలేం.. బావమరదలు ఒకేసారి... | Shocking Facts Revealed In Bhuvanagiri resort case, Their Last Letter Went Viral | Sakshi
Sakshi News home page

మేం ఉండలేం.. బావమరదలు ఒకేసారి...

Jun 30 2025 7:45 AM | Updated on Jun 30 2025 12:33 PM

Bhuvanagiri resort case Related Full Details

సాక్షి, భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. స్థానికంగా ఉన్న ఓ రిసార్టులో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, ఇద్దరూ వేర్వేరుగా వివాహం చేసుకున్నారు. కాగా, ఇద్దరు సన్నిహితంగా ఉండటంతో వీరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతుందని ఇరు కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ కారణంగానే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వీడియో, లేఖలో పేర్కొన్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బీబీనగర్ ఎస్‌ఐ రమేశ్ మాట్లాడుతూ.. మేడ్చల్ జిల్లాకు చెందిన బంధబాల సుధాకర్ (39), రామంతాపూర్‌లోని గాంధీ నగర్‌కు చెందిన పాసాల సుష్మిత (35) సమీప బంధువులు. ఇద్దరూ వేర్వేరుగా వివాహం చేసుకున్నారు. వీరి స్వగ్రామం నల్గొండ జిల్లా కేతేపల్లి.. ఇద్దరు వరుసకు బావామరదలు  అవుతారు. ఇరు కుటుంబాలు ప్రస్తుతం రామంతపూర్‌లో నివాసం ఉంటున్నారు. అయితే, వీరిద్దరూ సన్నిహితంగా ఉండటంతో ఇద్దరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతుందని ఇరు కుటుంబాల్లో తగాదాలు జరుగుతున్నాయి.

ఇదే కారణంగా నల్గొండ జిల్లాలోని కేతేపల్లి పోలీస్ స్టేషన్‌లో సుష్మితపై ఆమె భర్త కేసు పెట్టారు. దీంతో మనస్తాపానికి గురై రెండు రోజుల కిందట బీబీనగర్ మండలం కొండమడుగు శివారులోని రిసార్ట్‌లో సుష్మిత, సుధాకర్ రూమ్ తీసుకొని ఇక్కడే ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఇద్దరు కలిసి సూసైడ్ చేసుకుంటున్నట్లు సుధాకర్ తన బావ రంజిత్‌కి వీడియో కాల్ చేసి చెప్పాడు. కానీ ఎక్కడ నుంచి ఫోన్ చేసినట్లు చెప్పలేదు. ఉప్పల్ పోలీసుల సాయంతో బీబీనగర్ పోలీస్‌ స్టేషన్‌కు రంజిత్‌ సమాచారం ఇచ్చాడు. ఆదివారం సాయంత్రం మొబైల్ నెట్‌వర్క్‌ ఆధారంగా కొండమడుగు శివారులోని రిసార్ట్స్‌కు చేరుకొన్నారు. వారు ఉంటున్న రూమ్ తలుపులు పగులకొట్టి చూసేసరికి ఇద్దరు మృతి చెంది ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఇదిలాఉండగా.. చనిపోయే ముందు సుష్మిత, బాల సుధాకర్‌ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఈ వీడియోలో బాల సుధాకర్‌ మాట్లాడుతూ.. ఆయన భార్య తనను వేధిస్తోందన్నారు. ప్రతీ విషయంలో తనను అనుమానిస్తున్నట్టు తెలిపారు. అలాగే, సుష్మిత మాట్లాడుతూ.. తన భర్త వేధింపులు భరించలేకపోతున్నాను. బాల సుధాకర్‌తో మాట్లాడినందుకే నాతో అక్రమ సంబంధం అంటగట్టాడు. అందరిలో నన్ను తల దించుకునేలా చేశాడు అని తెలిపారు. అంతకుముందు వీరిద్దరూ కలిసి ఓ లేఖ కూడా రాసిపెట్టి పలు విషయాలను అందులో వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement