
అధికారులతో మాట్లాడుతున్న సీఎం రేవంత్రెడ్డి. చిత్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తదితరులు
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
రేపు ప్రారంభం కానున్న పోర్టల్
ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా భూ భారతి బలోపేతం
ఆ తర్వాతే రాష్ట్రవ్యాప్తంగా అమలు: సీఎం రేవంత్రెడ్డి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారం, భూ లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా తీసుకొస్తున్న భూ భారతి పోర్టల్ను తొలుత పైలెట్ పద్ధతిలో ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 14వ తేదీ నుంచి ఈ పోర్టల్ అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. కాగా దీనిని ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని మూడు మండలాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మండలాల్లో అమలు సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలు స్వీకరించి పోర్టల్ను మరింత బలోపేతం చేసి, ఆ తర్వాత రాష్ట్రమంతా అమలు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. శనివారం జూబ్లీహిల్స్లోని తన క్యాంపు కార్యాలయంలో భూ భారతి, హౌసింగ్ శాఖలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులకు సీఎం సూచనలు ఇచ్చారు.
ప్రజలు, రైతులకు అవగాహన సదస్సులు
భూ భారతి ప్రారంబోత్సవం అనంతరం రాష్ట్రంలోని 3 మండలాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుని, ఆయా మండలాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలు, రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సదస్సుల్లో వ్యక్తమయ్యే సందేహాలను అధికారులు నివృత్తి చేయాలని సూచించారు.
ఈ మండలాల్లో నిర్వహించిన అనంతరం రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ సదస్సులు నిర్వహించాలని, ప్రజల సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు పోర్టల్ను అప్డేట్ చేయాలని ఆదేశించారు. ప్రజలు, రైతులకు అర్థమయ్యేలా, సులభమైన భాషలో పోర్టల్ ఉండాలని సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీఎం ప్రధాన కార్యదర్శులు వి.శేషాద్రి, చంద్రశేఖర్రెడ్డి, రెవెన్యూ ఉన్నతాధికారులు పలువురు పాల్గొన్నారు.
అత్యంత నిరుపేదలు, అర్హులకే ఇళ్లు కేటాయించాలి
అత్యంత నిరుపేదలు, అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు దక్కేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ శాఖ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు. గ్రామ స్థాయిలో లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలు జాగ్రత్త వహించాలని, అర్హులనే ఎంపిక చేయాలని సూచించారు. ఇందిరమ్మ కమిటీ తయారు చేసిన జాబితాను మండల అధికారులతో కూడిన (తహసీల్దార్, ఎంపీడీవో, ఇంజినీర్) బృందం క్షేత్ర స్థాయికి వెళ్లి తనిఖీ చేయాలని, ఎవరైనా అనర్హులకు ఇల్లు దక్కినట్లైతే తక్షణమే దానిని ఇందిరమ్మ కమిటీకి తెలియజేసి ఆ స్థానంలో మరో అర్హునికి ఇల్లు మంజూరు చేయాలని చెప్పారు.
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఎవరైనా దందాలు చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే కేసులు నమోదు చేయాలని సూచించారు. అనర్హులు ఎవరైనా ఇల్లు దక్కించుకొని నిర్మించుకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు వారు పొందిన మొత్తాన్ని వసూలు చేయాలని ఆదేశించారు. లబ్ధిదారుకు మంజూరైన ఇంటిని అతని సౌలభ్యం ఆధారంగా అదనంగా 50 శాతం మేర నిర్మించుకునే అవకాశం కల్పించాలని చెప్పారు. సిమెంట్, స్టీల్ తక్కువ ధరలకు అందేలా చూడాలని సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.