విద్యుత్‌ ప్రాజెక్టుల్లో వేగం పెంచండి | Bhatti Vikramarka reviews renewable power plants to be undertaken by Singareni Company | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ ప్రాజెక్టుల్లో వేగం పెంచండి

Jun 29 2025 5:53 AM | Updated on Jun 29 2025 5:53 AM

Bhatti Vikramarka reviews renewable power plants to be undertaken by Singareni Company

నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తి చేయాలి 

ప్రాజెక్టుల పర్యవేక్షణకు డ్యాష్‌ బోర్డు  

సింగరేణిపై సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి సంస్థ చేపట్టనున్న 800 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్లు, 500 మెగావాట్ల పవన విద్యుత్తు ప్లాంట్, 500 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు పనులు మరింత వేగవంతం చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. కాల పరిమితి విధించుకొని సత్వరమే ప్రాజెక్టులను చేపట్టాలని సూచించారు. శనివారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో సింగరేణి సంస్థ చేపట్టనున్న పునరుత్పాదక విద్యుత్తు ప్లాంట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ లోయర్‌ మానేరు రిజర్వాయర్‌పై నిర్మించనున్న 300 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్, మల్లన్నసాగర్‌పై నిర్మించతలపెట్టిన 500 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్లకు ఇరిగేషన్‌ శాఖ అనుమతుల కోసం లేఖలు రాయాలని ఆదేశించారు. సింగరేణి సంస్థ ఐదు జిల్లాలలో ఏర్పాటు చేయనున్న 500 మెగావాట్ల పవన విద్యుత్తు ప్లాంట్లకు సంబంధించిన డీపీఆర్‌లను వచ్చే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సూచించారు. 

రామగుండం–1 ఏరియాలో మేడిపల్లి ఓపెన్‌ కాస్ట్‌ గని నీటిసంపు ఆధారంగా నిర్మించ తలపెట్టిన 500 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం పనులు తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా రాజస్తాన్‌ విద్యుత్‌ ఉత్పాదన్‌ నిగం లిమిటెడ్‌తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 1,500 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను ఆ రాష్ట్రంలోని సోలార్‌ వ్యాలీలో త్వరితగతిన ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ఒప్పందంలో భాగంగా ఏర్పాటుచేసే 800 మెగావాట్ల థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుపైనా కూలంకశంగా చర్చించారు. 

వీటితోపాటు సింగరేణి ఏర్పాటు చేయనున్న గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంట్, బ్యాటరీ స్టోరేజీ సిస్టం వంటి ఇతర పనులపైనా భట్టి సమీక్షించారు. ఇంధన శాఖలోని అన్ని విభాగాల పనితీరును, చేపడుతున్న ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు వీలుగా డాష్‌ బోర్డును రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో సింగరేణి సీఎండీ ఎన్‌.బలరామ్, ఇంధన శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నవీన్‌ మిత్తల్, తెలంగాణ రెడ్కో వైస్‌ చైర్మన్‌ అనీలా, సింగరేణి ఉన్నతాధికారులు ఎస్‌.డి.ఎం సుభానీ, చిరంజీవులు, జానకిరామ్, శ్రీనివాసులు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.   

సింగరేణి ప్రమాద బీమా పథకం దేశానికి ఆదర్శం 
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క  
సింగరేణి ఉద్యోగి కుటుంబానికి రూ.1.2 కోట్ల ప్రమాద బీమా చెక్కు అందజేత 
సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌)లో అమలు చేస్తున్న ప్రమాద బీమా పథకం దేశానికే ఆదర్శమని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన ఓ కారి్మకుడి కుటుంబానికి రూ.1.2 కోట్ల బీమా సొమ్ము చెక్కును శనివారం మహాత్మా జ్యోతిబాఫపూలే ప్రజా భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రామగుండం–1 ఏరియాకు చెందిన సపోర్టు మెన్‌ పెండ్రి రంజిత్‌ కుమార్‌ భార్య లతకు అందజేశారు. 

సింగరేణి కార్మికుడు పెండ్రి రంజిత్‌ కుమార్‌కు ఎస్‌బీఐలో వేతన ఖాతా ఉంది. ఇటీవల ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో మృతుడి నామినీగా ఉన్న భార్య లతకు రూ.1.2 కోట్ల ప్రమాద బీమా కింద అందించారు. కార్యక్రమంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిత్తల్, సింగరేణి సీఎండీ ఎన్‌.బలరామ్, రెడ్కో వైస్‌ చైర్మన్, ఎండీ అనీలా, ఎస్‌బీఐ డీజీఎం నీలాక్షి సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement