కేంద్ర విద్యాశాఖ నిర్ణయం.. ఇక నాలుగేళ్ల కోర్సుగా బీఈడీ! | BED as a four year course | Sakshi
Sakshi News home page

కేంద్ర విద్యాశాఖ నిర్ణయం.. ఇక నాలుగేళ్ల కోర్సుగా బీఈడీ!

May 17 2023 2:28 AM | Updated on May 17 2023 11:32 AM

BED as a four year course - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మారుతున్న బోధన విధానాలకు అనుగుణంగా అధ్యాపకుల శైలిలోనూ మార్పులు తేవాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా బ్యాచులర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఈడీ) కోర్సుల స్వరూప స్వభావాన్ని మార్చాలని ప్రతిపాదించింది. ఇప్పుడున్న రెండేళ్ళ కాలపరిమితి స్థానంలో కోర్సును నాలుగేళ్ళకు పెంచబోతున్నారు. ఇప్పటికే బీఈడీ కోర్సుల మార్పులకు సంబంధించిన ముసాయిదా ప్రతిని రూపొందించారు.

గత నెల 27న ఢిల్లీలో దీనిపై ప్రత్యేక సమావేశం జరిగింది. రాష్ట్రాలకు చెందిన ఉన్నత విద్యా మండళ్ళు, కేంద్ర విద్యాశాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు. నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్స్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ)కి బీఈడీలో కొత్త కోర్సుల రూపకల్పన బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించారు. జాతీయ విద్యావిధానం–2020లో తీసుకొ­చ్చిన మా­ర్పులను అనుగుణంగా ఉపాధ్యాయ వృత్తిలోనూ గుణాత్మక మార్పులతో ముసాయిదా రూపొందించారు.  

నవీన బోధన విధానం..: కాలానుగుణంగా వస్తున్న మార్పులతో నవీన బోధన విధానంతో కొత్త సబ్జెక్టులను బీఈడీలో చేర్చబోతున్నారు. విద్యార్థి సైకాలజీని అర్థం చేసుకుని, సునిశిత విశ్లేషణతో బోధించే మెళకువలు ఇందులో పొందుపర్చాలని నిర్ణయించారు.

బోధన ప్రణాళికలో వర్చువల్, డిజిటల్‌ పద్ధతులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. వాస్తవ ప్రపంచంలోకి వెళ్ళి విద్యార్థి సముపార్జించే జ్ఞానాన్ని ఉపాధ్యాయుడు ఏ విధంగా గుర్తించాలనే అంశాలను బీఈడీలో చేర్చబోతున్నారు. ఆన్‌లైన్, డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌కు అనుగుణంగా పుస్తకాల్లో ఉన్న సబ్జెక్టును విద్యారి్థకి అర్థమయ్యేలా టెక్నాలజీతో అందించే విధానాన్ని బీఈడీలో పాఠ్యాంశాలుగా చేర్చనున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement