‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0’తో గుర్తించిన పోలీసులు
9 రాష్ట్రాల్లో హైదరాబాద్ బృందాల దాడులు
32 మంది బ్యాంకు అధికారులు సహా 52 మంది అరెస్టు
రూ.150 కోట్లతో ముడిపడిన 850 కేసుల్లో వీరి ప్రమేయం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జరుగుతున్న భారీ సైబర్ మోసాల నెట్వర్క్ను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ‘ఆపరేషన్ ఆక్టోపస్–2’ పేరుతో నిర్వహించిన 9 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి, బ్యాంకు అధికారులు సహా 52 మందిని అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్ బ్యాంకు అధికారులు, సైబర్ నేరగాళ్లకు మధ్య ఉన్న సంబంధాలను మరోసారి బయటపెట్టిందని అధికారులు ఆదివారం ప్రకటించారు.
పెట్టుబడి స్కామ్లు, ట్రేడింగ్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ పేరుతో అమాయకులను బెదిరించి భారీగా సొమ్ము దోచుకుంటున్న ముఠాలకు అండగా నిలుస్తున్న బ్యాంకు అధికారులే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగింది. నిందితుల్లో 32 మంది బ్యాంకు అధికారులు కాగా, 15 మంది మ్యూల్ ఖాతాదారులు, ఐదుగురు మధ్యవర్తులు ఉన్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ వి.అరవింద్ బాబు, ఏసీపీ ఆర్జీ శివ మారుతి నేతృత్వంలో 16 ప్రత్యేక బృందాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి.
సరైన పత్రాల్లేకుండానే ఖాతాలు..
ఫిబ్రవరిలో నిర్వహించిన ‘ఆపరేషన్ అక్టోపస్–1’లో 16 రాష్ట్రాల నుంచి 117 మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ ఆపరేషన్లో వెలుగు చూసిన అంశాల ఆధారంగా ఇప్పుడు ‘ఆపరేషన్ అక్టోపస్–2’ చేపట్టారు. దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. బాధితుల సొమ్మును దారి మళ్లించేందుకు నేరగాళ్లు 350 బ్యాంకు ఖాతాలను వినియోగించారు. ఈ ఖాతాలకు దేశవ్యాప్తంగా నమోదైన సుమారు 850 సైబర్ కేసులతో సంబంధం ఉంది. వీటి ద్వారా రూ.150 కోట్ల మేర అమాయకుల ధనాన్ని లూటీ చేశారని వెల్లడైంది.
బ్యాంకు అధికారులు మోసగాళ్లతో చేతులు కలిపి నిబంధనలకు విరుద్ధంగా ఖాతాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించినట్లు తేలింది. 16 ప్రత్యేక బృందాలు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్తాన్, పశ్చిమబెంగాల్, కర్ణాటక, గుజరాత్, బిహార్ల్లో దాడులు నిర్వహించాయి. కొన్ని ప్రైవేటు బ్యాంకులు కేవైసీ నిబంధనలను తుంగలో తొక్కుతూ, సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండానే ఖాతాలు తెరవడానికి అనుమతించడం వల్లే ’మ్యూల్’ ఖాతాలు పుట్టుకొస్తున్నాయని హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ చెప్పారు.
నేర ముఠాల్లోని కీలక వ్యక్తులను పట్టుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ కొనసాగుతోందని వివరించారు. వ్యక్తిగత బ్యాంకు ఖాతాలను ఇతరులకు వాడటానికి ఇచ్చి అక్రమాలకు సహకరిస్తే, వారిని కూడా నేరస్తులగానే పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే, విలువైన ’గోల్డెన్ అవర్’ను వృథా చేయకుండా తక్షణమే 1930 నంబర్కు లేదా ఠీఠీఠీ.ఛిyb్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీn వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని చెప్పారు.


