పాతబస్తీలోని బెంగాలీ నాయకులతో సమావేశంలో బండి సంజయ్
దూద్బౌలి (హైదరాబాద్): బెంగాల్లో జరగబోయే ఎన్నికలు దేశద్రోహులకు, బీజేపీకి మధ్య యుద్ధమని... ఈ యుద్ధంలో బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సోమవారం హైకోర్టు సమీపంలోని శ్రీ మురళీధర్ దేవాలయంలో ఘాన్సీబజార్ బెంగాలీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం చొరబాటుదారులకు సహకరిస్తూ వారికి ఓటర్ గుర్తింపు కార్డులను కల్పించి అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
బెంగాల్ ఎన్నికల్లో తమ కుటుంబీకులు, బంధువులు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని బండి సంజయ్ స్థానిక బెంగాలీలను కోరారు. శనివారం పాతబస్తీలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడానికి వచ్చిన జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులపై ఎంఐఎం దాడులకు దిగితే వారిపై ఎలాంటి చర్యలు లేవని.. దీనిపై సీఎం వెంటనే సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణలో హిందూ సమాజం ప్రమాదంలో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి డ్రగ్స్ను నిరోధిస్తున్నామని చెబుతున్నారని.. కానీ రాష్ట్రంలో డ్రగ్స్ విచ్చలవిడిగా లభిస్తున్నాయన్నారు.


