కరీంనగర్: తన కుమారుడు భగీరథ్పై నమోదైన పోక్సో కేసుపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో హిందూ ఏక్తా యాత్ర జరిగింది. దీనికి బండి సంజయ్, హంపీ పీఠాధిపతి విద్యారణ్యస్వామి హాజరయ్యారు.
‘‘నా కొడుకు ఏ తప్పూ చేయలేదు. నా కొడుకు కూడా అదే చెప్పాడు. నా కొడుకుకైనా, సామాన్యులకైనా చట్టం ఒకటే అని నమ్మేవాణ్ని. నేను ఏ దారిలో పోతే నా భార్య కూడా అదే దారిలో ప్రయాణం చేసి నా గెలుపులో భాగస్వామ్యమైంది. కన్న పేగు డిప్రెషన్లోకి పోతుంటే ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. నన్ను, నా కుటుంబాన్ని టార్గెట్ చేసి నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.
శ్రీరామచంద్రుడికే అరణ్యం తప్పలేదు.. నేనెంత? అంజన్నకు నిప్పు పెడితే లంకను ఎలా దగ్ధం చేశాడో ఈ సంజయ్ కూడా అదే చేస్తాడు. కుట్రలు, కుతంత్రాలు చేస్తుండో ఏ ఒక్కణ్నీ వదిలిపెట్టను. నా కొడుకుతో నేను మాట్లాడకపోవడం, టైం ఇవ్వకపోవడం నాదే తప్పు.
నా కార్యకర్తలే నా కుటుంబం అని తిరిగా. నా కొడుకు కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు. మనల్ని సవాల్ చేస్తే ముడుచుకుని కూర్చుందామా? గిరి గీసి కొట్లాడదామా..? అంజన్న వారసుడిగా ఈ కరీంనగర్ గడ్డ నుంచి గాండ్రిస్తూ వీటిని ఛేదిస్తానని చెబుతున్నా. నా కుమారుడు తప్పు చేస్తే కచ్చితంగా శిక్ష పడుతుంది. నా కుమారుడిని క్రిమినల్గా చూపే ప్రయత్నం చేస్తున్నారు’’ అని వార్నింగ్ ఇచ్చారు.


