సాక్షి, హైదరాబాద్: నగరంలో న్యాయవాది ఖాజా మొహిజుద్దీన్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో రాజకీయ నేత ఆలంఖాన్ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్కు చెందిన తండ్రీ కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, మొహిజుద్దీన్ చంపేందుకు ఆలంఖాన్ రూ.25లక్షల సుపారీ ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. తన భూములకు అడ్డం పడుతున్నాడని కారణంగానే మొహిజుద్దీన్ను వారు హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఇక, ఈ కేసులో ఆలంఖాన్ కుమారుడు ముజాహిద్ ఆలంఖాన్ సహా గ్యాంగ్ నలుగురు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. మొహిజుద్దీన్ హత్య కోసం ఆలంఖాన్ ఇప్పటికే 10 సార్లు ప్లాన్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇందులో భాగంగానే ప్లాన్ ప్రకారం.. మొహిజుద్దీన్ను సుపారీ గ్యాంగ్ కారుతో ఢీకొట్టి చంపినట్టు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. మొహిజుద్దీన్ కొన్నేళ్లుగా వక్ఫ్ భూముల పరిరక్షణకు పోరాడుతున్నారు. ఓ భూమికి సంబంధించి బర్కత్పురకు చెందిన ఆలంఖాన్తో విభేదాలు వచ్చాయి. తమ ఆధీనంలో ఉన్న ఈ భూమి విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ పలుమార్లు ఒత్తిడి తీసుకువచ్చారు. తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగడంతోపాటు ఆ భూ వివాదం కేసు నుంచి వైదొలిగితే రూ.2 కోట్లు ఇస్తామంటూ మొహిజుద్దీన్కు ఆఫర్ చేశారు. అయితే రాజీ పడబోనని చెప్పడంతో మొయిజుద్దీన్ను హత్యను చేయాలని భావించారు. ఆ పనిని సుపారీ గ్యాంగ్తో పనిపూర్తి చేయించాలని నగరానికి చెందిన కిషన్ సింగ్ అలియాస్ పప్పును వీరు కలిసి విషయం చెప్పారు. సుపారీ కింద రూ.15 లక్షలు చెల్లించారు. హత్య బాధ్యతను కవాడిగూడకు చెందిన సింగూరి అభిజీత్ అలియాస్ నాని, వినయ్, మణిదీప్లకు అప్పగించి రూ.10 లక్షలు చెల్లించాడు. ఈ ముగ్గురూ పప్పుతో కలిసి పథకం వేసి, కారు కొని, రెక్కీ చేసి, శనివారం మొయిజుద్దీన్ను రెడ్హిల్స్ శాంతినగర్లో హత్య చేశారు.
అభిజిత్ గుర్తింపు...
స్టంట్స్ చేయడంలో అనుభవం ఉన్న అభిజితే ఆ రోజు కారు నడిపాడు. మణిదీప్, వినయ్ అందులో కూర్చున్నారు. డ్రైవింగ్ నైపుణ్యం కారణంగానే ఇతడు నడిపిన, మొయిజుద్దీన్ ఎక్కబోయిన కార్లలో ఏదీ దెబ్బతినలేదు. ఈ హత్య చేసే సమయంలో కారుకు నెంబర్ ప్లేట్ లేకపోయినా వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను టాస్క్ఫోర్స్ పోలీసులు అధ్యయనం చేశారు. వీటి ఆధారంగా అభిజిత్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.



