
మర్రిపల్లిలో భూమినిగుర్తించిన సిరిసిల్ల కలెక్టర్
అదనపు సదుపాయాలతోఆధునిక ఏర్పాట్లు
కోడెల ఆరోగ్యంపై స్వయంగా గోశాలలో రోజూ కలెక్టర్ తనిఖీలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తిప్పాపూర్ గోశాలలో కోడెల మరణఘోషను ఆపేందుకు ఎట్టకేలకు ప్రభుత్వం నడుం బిగించింది. సీఎం ఆదేశాలతో కోడెల కోసం అదనపు గోశాలను నిర్మించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. వేములవాడ పట్టణానికి సమీపంలో మర్రిపల్లి గ్రామంలో ప్రస్తుతం 30 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించింది. ఈ భూములను గురువారం కలెక్టర్ సందీప్కుమార్ ఝా స్వయంగా పరిశీలించారు.
అయితే, సీఎం రేవంత్ మొత్తం 50 ఎకరాల్లో గోశాలను నిర్మించాలని సూచించిన నేపథ్యంలో 30 ఎకరాలకు పక్కనే ఉన్న మరో 20 ఎకరాల భూమిని కూడా సేకరించేందుకు అధికారులు సిద్ధమవు తు న్నారు. అక్కడ అదనపు సదుపాయాలతో కోడెలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయను న్నారు.
భక్తులు రాజన్నకు సమర్పించిన కోడెలు, దూడల మృత్యఘోషతో అప్రమత్తమైన సర్కారు వాటి బాగోగులు చూడాలని, కోడెల మరణాలు వెంటనే తగ్గించాలని ఆదేశించడంతో కలెక్టర్ రంగంలోకి దిగి ప్రతీరోజూ తిప్పాపూర్లోని గోశాలను సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా వెటర్నరీ అధికారులు పలు విషయాలను కలెక్టర్కు నివేదిక రూపంలో ఇచ్చారు.
నివేదికలో ఏముందంటే..?
రాజన్న ఆలయానికి భక్తులు కానుకగా ఇచ్చే కోడెల లో ఆరోగ్యం, ఎదుగుదల లోపిస్తున్నాయి. కోడెల్లో మరీ పాలు కూడా మరవని 6 నెలలలోపు చిన్న దూడలు, రేపోమాపో చనిపోయే ముసలి కోడెలు ఉంటున్నాయి. ప్రస్తుత గోశాలలో 300 కోడెలు మాత్రమే ఉండగలవు. కానీ, 1,300 వరకు కోడెలు ఇరుకుగా బతుకుతున్నాయి. ఆహారం కొరతతో తొక్కిసలాట జరగడం, మదమెక్కిన కోడెలు చిన్న దూడలు, ముసలి కోడెలపై దాడి చేస్తున్నాయి. దీంతో అవి గాయాలతో మరణిస్తున్నాయి.
ఆలయ ఈవో, సిబ్బందిపై ఏసీబీ నివేదిక..
ఓ వైపు కోడెల వరుస మరణాలతో అప్రతిష్ట మూటగట్టుకుంటున్న ఆలయ సిబ్బందిపై మరో పిడుగుపడింది. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆలయంలో పలు విభాగాల్లో అక్రమాలు జరుగుతున్నాయని నిగ్గు తేల్చడం చర్చనీయాంశంగా మారింది. లడ్డూ ప్రసాదంతో సహా.. ఆలయంలో జరుగుతున్న పలు అక్రమాలలో ఆలయ ఈవో సహా మరో ఆరుగురి పాత్ర ఉందని నిర్ధారించిన ఏసీబీ వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు సమాచారం.
ఈవో వినోద్రెడ్డి, రికార్డ్ అసిస్టెంట్ ఎన్.సునీల్, టి.అజయ్, లడ్డూ కౌంటర్ ఇన్చార్జి బి.లక్ష్మారెడ్డి, సూపరింటెండెంట్ గుండి నరసింహామూర్తి, వారి నర్సయ్య జూనియర్ అసిస్టెంట్ ఏలేటి నరేందర్లపై చర్యలు తీసుకోవాలని ఏసీబీ సిఫారసు చేసింది. దీంతో డిపార్ట్మెంట్ ఎంక్వైరీ నిర్వహించి, తగిన చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ దేవాదాయ శాఖ డైరెక్టర్ను ఆదేశించారు.