సాక్షి,హైదరాబాద్: నారాయణగూడ సర్వే భవన్ డిప్యూటీ డైరెక్టర్ నరహరి అవినీతి అక్రమాల లెక్కలు వెలుగులోకి వచ్చాయి. పలు ప్రాంతాల్లో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులకు రూ.100కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తేలింది. అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు.
సర్వే ల్యాండ్ రికార్డ్స్ మల్టీ జోన్-2 డిప్యూటీ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్న నరహరిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ప్రతీ ల్యాండ్ రికార్డ్స్ విషయంలో క్రింది స్థాయి సిబ్బందితో కలిసి డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదులపై ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ నేతృత్వంలో ఛత్రినాకలోని నరహరి నివాసం.. నారాయణగూడ సర్వే భవన్తో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు జరిపారు.
ఈ సోదాల్లో నరహరి నివాసంలో రూ.1.54 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు రూ.1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండి సీజ్ చేశారు. అంతేకాదు నరహరి బ్యాంక్ ఖాతాల్లో రూ.2.29కోట్లు గుర్తించారు. దీంతో పాటు రూ.5.04కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు, రంగారెడ్డి జిల్లాలో 5 ఫ్లాట్లు, 1.24 ఎకరాల భూమి, పుప్పాలగూడ, నార్సింగి, రాజేంద్రనగర్లో విలువైన ఫ్లాట్లు,గచ్చిబౌలిలో జీప్లస్3, ఛత్రినాకలో జీప్లస్ 2 భవనాలు గుర్తించారు. నరహరి భార్య పేరిట రెండు లాకర్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు.


