సాక్షి, చైన్నె : తమిళనాడులోని ఈరోడ్కు చెందిన రేనాటస్ గ్రూప్కి చెందిన ప్రముఖ నిర్మాణ సామగ్రుల బ్రాండ్ రెనాకాన్ , రెనాటస్ ప్రొడక్ట్స్ రెనాఫ్లెక్స్ పేరిట ఫైబర్ సిమెంట్ బోర్డులను ఆవిష్కరించింది. స్థానికంగా వీటిని రేనాటస్ గ్రూప్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్పీ సెల్వసుందరం పరిచయం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ అనుకూల నిర్మాణ సామగ్రి తయారీ సంస్థ నుండి పూర్తి స్థాయి నిర్మాణ పరిష్కారాల సంస్థగా ఎదుగుతున్న ప్రయాణంలో ఇది ఒక కీలక మైలురాయిగా వివరించారు. రూ.350 కోట్ల భారీ పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్లోని నాయిడుపేటలో రెనాకాన్ ప్రపంచ స్థాయి సమగ్ర తయారీ కేంద్రాన్ని నెలకొల్పినట్టు పేర్కొన్నారు. 12 నెలల రికార్డు వ్యవధిలో నిర్మించిన ఈ ప్లాంట్, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ల్యామినార్ ఫ్లో టెక్నాలజీని భారత్కు పరిచయం చేశామన్నారు. ఆధునిక నిర్మాణ రంగానికి అవసరమైన సునిశితమైన, అత్యుత్తమ నాణ్యత కలిగిన సుస్థిర నిర్మాణ సామగ్రిని ఇది అందిస్తుందన్నారు. విజన్ 2047, మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా, వేగవంతమైన, సురక్షితమైన, పర్యావరణ అనుకూల నిర్మాణాలకు రెనాఫ్లెక్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. తమిళనాడులోని 3 ప్లాంట్ల ద్వారా ఏడాదికి 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్నట్టు ప్రకటించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.ఓ కింద నిర్మించే 1 కోటి అదనపు గృహాలు, సరసమైన అద్దె గృహాల సముదాయాల నిర్మాణాలను వేగవంతం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని ధీమావ్యక్తం చేశారు.


