సాక్షి, చైన్నె : స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న 23వ కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్లిఫ్టర్లు అద్భుత ప్రతిభను కనబరుస్తున్నారు. పోటీల మూడో రోజున భారత్ వెయిట్లిఫ్టింగ్లోనే ఏకంగా ఒక స్వర్ణం, రెండు రజతాలతో కలిపి మొత్తం 3 పతకాలు సాధించి సత్తా చాటింది. ఇందులో తమిళనాడుకు చెందిన రాజా ముత్తుపాండి రజతం సాధించడం రాష్ట్రంలో ఆనందం వెల్లి విరిసింది.తమిళనాడుకు చెందిన వెయిట్లిఫ్టర్ రాజా ముత్తుపాండి పురుషుల 65 కేజీల విభాగంలో రజత పతకం సాధించారు. కాగా తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాకు చెందిన రాజా ముత్తుపాండి పురుషుల 65 కేజీల బాడీవెయిట్ విభాగంలో స్నాచ్లో 126 కేజీలు, క్లీన్ అండ్ జర్క్లో 160 కేజీలు కలిపి మొత్తం 286 కేజీల బరువు ఎత్తి రెండవ స్థానంలో నిలిచి సత్తా చాటారు.
సీఎం విజయ్ రూ. 30 లక్షలు ప్రోత్సాహం
తమిళనాడుకు గర్వకారణంగా నిలిచిన రాజా ముత్తుపాండిని రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ సోషల్ మీడియా వేదికగా అభినందించారు. కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకం సాధించిన తూత్తుకుడి వీరుడు రాజా ముత్తుపాండికి తన హదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఆయన ఘనతకు గుర్తింపుగా తమిళనాడు ప్రభుత్వం తరఫున రూ. 30 లక్షల ప్రోత్సాహక బహుమతిని ప్రకటిస్తున్నామన్నారు. ఆయన విజయం ఎంతో మంది యువతకు స్ఫూర్తినివ్వాలి అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సైతం అభినందించారు. కాగా, రాజా ముత్త పాండి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ చిన్న తనం నుంచి కష్ట పడి చదువుకుంటూ , వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొంటూ వచ్చాడని పేర్కొన్నారు. అతడి శ్రమకు గుర్తింపు దక్కిందని పేర్కొన్నారు.


