సాక్షి, చైన్నె: ఈశాన్య రుతుపవనాల రాకను దృష్టిలో ఉంచుకుని, తమిళనాడు వ్యాప్తంగా జలాశయాలలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి విజయ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని చెరువులు, కాలువలు, జలాశయాల్లో పూడికతీత , పునరుద్ధరణ పనులను నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎన్. ఆనంద్ వేగవంతం చేశారు. చైన్నెలోఈ పనులను ఉదయం మంత్రి ప్రారంభించారు. కూవం నది, పల్లికరనై చిత్తడి నేలలు, ఓక్కియం మడువు ప్రాంతాలలో శనివారం ఉదయం పూడికతీత పనులను మంత్రి పరిశీలించారు. ఈపనులను ద్విచక్ర వాహనంపై దూసుకెళ్తూ మంత్రి పరిశీలించడం విశేషం. కూవం నది తీరంలోని అమింజికరై పడికుప్పంలలో ఉదయం 9 గంటలకు ఒక్కియంలో 11 గంటలకుపనులను పరిశీలించారు. ఒక్కియం చెరువు, కాలువల పూడికతీత పనులను పరిశీలించారు. 2.63 కిలోమీటర్ల పొడవు, 80 నుండి 140 మీటర్ల వెడల్పు ఉన్న ఈ కాలువ ద్వారా వర్షపు నీరు పల్లికరనై చిత్తడి నేల నుండి బకింగ్హామ్ కాలువ మీదుగా సముద్రంలోకి చేరుకుంటుంది. మొదటి దశలో 2,650 మీటర్ల పూడికతీత పనులు చేపట్టారు. వరద ముప్పు నివారణ చర్యల్లో భాగంగా మంత్రి ఆనంద్ తదుపరి పరిశీలన 28వ తేది మనపాక్కం సమీపంలోని అడయార్ నది, షోళింగనల్లూరు, అక్కరై వంతెన వద్ద సౌత్ బకింగ్హామ్ కాలువ పనుల పరిశీలన జరగనున్నది. 29వ తేదీన వేలచ్చేరి, నారాయణ పురం చెరువులను పరిశీలించనున్నారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈశాన్య రుతుపవనాలు రాకముందే జలాశయాల పూడికతీత పనులన్నీ ఆలస్యం లేకుండా, ఎటువంటి లోపాలు జరగకుండా పూర్తి చేయాలన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండటం అత్యంత ముఖ్యం అని పేరొకటూ, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 36 వేల చెరువులలో నీటిపారుదల పనులు ముమ్మరం చేయాలని సూచించారు.


