సాక్షి, చైన్నె: చైన్నె దక్షిణంలోని శివారు ప్రాంతమైన తాంబరం , దాని పరిసరాల్లో ప్రతి ఏటా వర్షాకాలంలో తలెత్తే వరద ముప్పును అరికట్టేందుకు తాంబరం మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ. 165 కోట్ల వ్యయంతో 7 ప్రధాన చెరువులనుఏ పునరుద్ధరించడానికి , పూడిక తీయడానికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. చైన్నెకు దక్షిణంలో ఉన్న తాంబరం పరిసరాలలో అనేక చెరువులు నిండినా, తెగినా, ఆ ప్రబావం చైన్నెనగరంపై ప్రతి ఏటా వర్షాల సీజన్లో పడుతున్న విషయం తెలిసిందే. ఈ పరిసరాలలో ఆక్రమణల తొలగింపునకు పదే పదే కోర్టులు సైతం ఉత్తర్వులు జారీ చేసినా ఇన్నాళ్ళు ఫలితం శూన్యం.తాజాగా రాష్ట్రంలో అధికార మార్పు నేపథ్యంలో తాంబరం కార్పొరేషన్ అధికారులు వరద నివారణ లక్ష్యంగా దూకుడు పెంచేందుకు సిద్ధమయ్యారు.
ఆక్రమణల తొలగింపు – పునరుద్ధరణ
చెరువులు, నీటిమార్గాల ఆక్రమణల వల్ల వర్షాకాలంలో తూర్పు, పశ్చిమ తాంబరం ప్రాంతాలు తీవ్రంగా ముంపునకు గురవుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి మాడంబాక్కం, వీరరాఘవన్, నెమిలిచ్చేరి, నన్మంగళం, సైలెయూర్, పీకంకరనై , రాజకీజ్పాక్కం లోని 7 చెరువలలోని ఆక్రమణలను తొలగించి, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు లోతుగా పూడిక తీయనున్నారు.
కార్పొరేషన్ పరిధి విస్తరణ
తాంబరం విస్తరణలో భాగంగా మేడవాక్కం, కోవిలంపాక్కం, ముడిచూర్, పెరుంపాక్కం సహా 19 గ్రామ పంచాయతీలు 2027లో తాంబరం కార్పొరేషన్లో విలీనం కానున్నాయి. దీనివలన కార్పొరేషన్ పరిధిలోని మొత్తం చెరువుల సంఖ్య 35కి పెరుగుతుంది. ఇప్పటికే కార్పొరేషన్ 10 చెరువులను విజయవంతంగా పునరుద్ధరించింది.
2,000 దుకాణాల ఆక్రమణలపై చర్యలు
చెరువులు, వాటి సమీపంలో సుమారు 2,000 మంది ఫుట్ పాత్ వ్యాపారులు ఉన్నట్లు కార్పొరేషన్ సర్వేలో తేలింది. ఆక్రమణలకు గురైన ప్రాంతాల వివరాలతో జాబితా సిద్ధం చేశామని, త్వరలోనే తొలగింపు చర్యలు చేపడతామని చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసన్ తెలిపారు.
ప్రాజెక్టులో చేపట్టే పనులు
చెరువుల నుంచి నుండి పూడిక తీత, కలుపు మొక్కల తొలగింపు. గట్లను బలోపేతం చేసి ఎత్తు పెంచడం, తూములు , అదనపు ఆనకట్టల పునర్నిర్మాణంకు చర్యలు తీసుకోనున్నారు. వీటిలో మురుగునీరు కలవకుండా శుద్ధి కర్మాగారాలకు మళ్లించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. చెరువుల చుట్టూ కంచెలు వేయడం, నడక దారులు , చెట్ల పెంపకం, సీసీటీవీ నిఘా ఏర్పాటుకు నిర్ణయించారు.


