సాక్షి, చైన్నె : పళనిలో జరిగిన రూ. 100 కోట్ల భూ రిజిస్ట్రేషన్ అక్రమాల్లో తమిళగ వెట్రి కళగం(టీవీకే) ప్రభుత్వమే మొదటి నిందితుడని అన్నాడీఎంకే మాజీ మంత్రి, దిండిగల్ తూర్పు జిల్లా కార్యదర్శి దిండిగల్ సి. శ్రీనివాసన్ తీవ్ర ఆరోపణలు చేశారు. పళని దండాయుధపాణి స్వామి ట్రస్టుకు చెందిన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడాన్ని నిరసిస్తూ, ఈ కేసును సీబీఐ కి అప్పగించాలని డిమాండ్ చేస్తూ శనివారం పళని జంక్షన్లో అన్నాడీఎంకే తరఫున భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న దిండిగల్ శ్రీనివాసన్ మాట్లాడుతూ ‘‘స్వచ్ఛమైన పరిపాలన అందిస్తాం, లంచం తీసుకోం, అవినీతిపరులను వదిలిపెట్టం అని చెప్పే ముఖ్యమంత్రి విజయ్... పళని భూ రిజిస్ట్రేషన్ అక్రమాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? సంబంధిత మంత్రులకు తెలియకుండా ఇది జరగదు. కాబట్టి ఈ కుంభకోణంలో మొదటి నిందితుడు టీవీకే ప్రభుత్వమే’’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కేసు బయటపడగానే తాము నిజాయితీపరులం అన్నట్లు సీబీసీఐడీ విచారణకు ఆదేశించారని గుర్తుచేశారు.ఆ విభాగం ఏమైనా అమెరికా నుంచి వచ్చిందా? ముఖ్యమంత్రి ఏం చెబితే విచారణ సంస్థలు అదే నివేదిక ఇస్తాయని విమర్శించారు. భూమి అమ్మినవారు, కొన్నవారు, రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, వారు ముందస్తు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారని మండిపడ్డారు. విదేశాల్లో ఉన్న నేరస్థులను పట్టుకొచ్చే పోలీసులు పళనిలోని ముగ్గురిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.
రాష్ట్రవ్యాప్త ఆందోళనల హెచ్చరిక: పళని భూ కుంభకోణంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లోనూ ఆందోళనలు చేపట్టి ప్రభుత్వ ముసుగును తొలగిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో పళని ఎమ్మెల్యే రవి మనోహరన్, దిండిగల్ పశ్చిమ జిల్లా కార్యదర్శి పరమశివం, మాజీ ఎంపీ కుమారసామి సహా భారీ సంఖ్యలో అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


