సాక్షి, చైన్నె : సాంకేతికత, వైద్యం మేళింపుతో ఆరోగ్య సంరక్షణకు భవిష్యత్తు అని ఐఐటీ మద్రాసు డైరెక్టర్ ప్రొఫెసర్ వీ కామకోటి తెలిపారు. చైన్నెలోని ది లీలా ప్యాలెస్ హోటల్లో శుక్రవారం మినిమల్లీ ఇన్వేసివ్ స్పైన్ సర్జన్స్ అసోసియేషన్ ఆఫ్ భారత్ వార్షిక అంతర్జాతీయ సదస్సు (మిస్సాబ్కాన్ – 2026)ను ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి ప్రారంభించారు. ఈ సదస్సు ఈనెల 26వ తేదీ వరకు జరగనుంది. ఆయన మాట్లాడుతూ భారతదేశానికి సరిపోయేలా అందుబాటులో ఉండే, వ్యక్తిగతీకరించిన, ముందస్తు అంచనాతో కూడిన వైద్య పరిష్కారాలను అందించాలంటే సాంకేతికత, ఇంజినీరింగ్, వైద్య రంగాల కలయికే ఏకై క మార్గమని తెలిపారు. ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్పూర్, ఐఐటీ కాన్పూర్, ఐఐఎస్సీ వంటి ప్రముఖ విద్యాసంస్థలు మెడిసిన్ అండ్ టెక్నాలజీ రంగాల్లో కొత్త కార్యక్రమాలను ప్రారంభించాయని తెలిపారు. భవిష్యత్తులో అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, ఇంజినీరింగ్ పరిష్కారాలు అవసరమయ్యే రంగాలలో బయోలాజికల్ సైన్సెస్, హెల్త్కేర్ అగ్రస్థానంలో నిలుస్తాయని పేర్కొన్నారు.
800 మంది ప్రతినిధులు హాజరు
ఈ సదస్సుల్లో 16 విదేశాల నుంచి 100 మందికి పైగా ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్సా నిపుణులతో పాటు మొత్తం 800 మంది సర్జన్లు పాల్గొననున్నారు. వెన్నెముక శస్త్రచికిత్సలో వచ్చిన ఆధునిక పోకడలపై చర్చించనున్నారు. ఆసియాలోనే అతిపెద్ద స్పైన్ సొసైటీ అయిన పసిఫిక్ అండ్ ఆసియన్ సొసైటీ ఆఫ్ మినిమల్లీ మినిమల్లీ ఇన్వేసివ్ స్పైన్ సర్జన్స్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వెన్నెముక సమస్యల చికిత్సపై నిబంధనలను రూపొందించడంతో పాటు, యువ వైద్యులకు అధునాతన శిక్షణ ఇవ్వడం, ప్రపంచ స్థాయి వైద్య సాంకేతికతను భారత్కు తీసుకురావడమే ఈ మిస్సాబ్ సొసైటీ ప్రధాన లక్ష్యంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామచంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఛాన్సలర్ వి.ఆర్.వెంకటాచలం, ట్రస్టీ సంయుక్త సంచాలకులు వెంకటాచలం, శ్రీ రామచంద్ర స్పైన్ సర్జరీ విభాగం అధిపతి – మిస్సాబ్ ప్రెసిడెంట్ డాక్టర్ కె.కార్తీక్ కై లాష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సుధీర్ గణేశన్ తదితరులు పాల్గొన్నారు.


