తిరుత్తణి: స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పరిసర ప్రాంతాల పరిశుభ్రత పట్ల నర్సింగ్ విద్యార్థినులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. స్వచ్ఛ భారత్ పథకం ద్వారా తిరుత్తణిలోని జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆధ్వర్యంలో శుక్రవారం పరిసర ప్రాంతాల శుభ్రత పట్ల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆసుపత్రి మెడికల్ ఆపీసర్ డాక్టర్ చంద్రకు మార్ ఆధ్వర్యంలో ప్రయివేటు నర్సింగ్ కళాశాల విద్యార్థినులు, ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్న అవగాహన ర్యాలీ చేపట్టారు. నర్సింగ్ విద్యార్థినులు ప్లకార్డులు చేతబట్టి పరిసర ప్రాంతాల శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో శుభ్రత పట్ల నర్సింగ్ విద్యార్థినులు, వైద్యులు, వైద్య సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.
కొరుక్కుపేట: మంత్రి రమేష్ కొన్ని రోజుల క్రితం చైన్నెలోని వడపళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిపాలనలో కొన్ని అవకతవకలు, అక్రమాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో పరిపాలనాపరమైన అవకతవకలకు బాధ్యుడైన జూనియర్ అసిస్టెంట్ హరి గోవింద్ను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా పళని తిరుచ్చి సమయపురం మారియమ్మన్ ఆలయ ఉద్యోగి మణికంఠన్ ఆదాయం కంటే ఎక్కువ ఆస్తులు కూడబెట్టాడని ఒక ఫిర్యాదు వచ్చింది. రెండు నెలల క్రితం పళనిపై దాడులు జరిగాయి. ఈ పరిస్థితిలో హిందూమత దేవాదాయ శాఖ మంత్రి రమేష్ ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఆదేశించారు. ప్రజా ప్రయోజనాలు, పరిపాలనా ప్రయోజనాల దృష్ట్యా వారిపై చర్యలు తీసుకున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. ఆలయ పరిపాలనలో ఎవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ధార్మిక శాఖ వర్గాలు హెచ్చరించాయి.
కొరుక్కుపేట: ఆషాడ మాసం రెండో శుక్రవారం సందర్భంగా కొల్లూర్ మూకాంబిగై పాద పూజ ను శ్రీ వాసవి మహిళా విభాగ్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దీనికి చైన్నె జార్జిటౌన్ లోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం మహామండపం వేదికై ంది. గత 34 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ పూజల్లో సంస్థ నిర్వాహకులు, సభ్యులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొంటున్నారు. ఈ శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు ఎస్కేపీడీ దేవస్థానం మహా మండపంలో కొల్లూర్ మూకాంబిగై అమ్మవారిని విశేషంగా అలంకరించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సామూహికంగా పాద పూజ నిర్వహించారు. కార్యక్రమ ఏర్పాట్లను శ్రీ వాసవీ మహిళా విభాగ్ అధ్యకురాలు టి.లావణ్య, ఉపాధ్యక్షురాలు కల్పన బాబు, కార్యదర్శి సరళ బాలాజీ, కోశాధికారి సరళ మనోహర్, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.
తిరువొత్తియూరు: పారిశుద్ధ్య కార్మికులు సేకరించిన చెత్తకు నిప్పు పెట్టడంతో పూరి గుడెసి కాలిపోయిందని, బాధితులకు న్యాయం చేయాలని బీజేపీ జాతీయ మైనారిటీ విభాగం కార్యదర్శి వేలూరు సైదు ఇబ్రహీం డిమాండ్ చేశారు. పెరియపాళెం సమీపం ఎల్లాపురం యూనియన్ కొడుంగయూర్ పంచాయతీకి చెందిన కారాణి గ్రామం, సెల్లియమ్మన్ కోవిల్ వీధిలో సెంథిల్ (43) నివసిస్తున్నాడు. ఇతనికి భార్య సరిత, కుమార్తె మీరా, కుమారుడు సునీల్ ఉన్నారు. మీరా కారణి గ్రామ బీజేపీ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత 6వ తేదీన కోడువెలి పంచాయతీ కార్యదర్శి ఉమానాథ్ ఉత్తర్వుల మేరకు పారిశుద్ధ్య కార్మికులైన సుమన్, కోమల, సెల్వి చెత్త కుప్పలకు నిప్పు పెట్టారు. ఆ సమయంలో నిప్పురవ్వలు ఎగిసిపడి సెంథిల్ పూరిగుడెసి కాలిపోయింది. ఇంట్లో ఉన్న విద్యుత్ ఉపకరణాలు, ఆధార్ కార్డ్, పాఠశాల ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డ్, రూ.95 వేల నగదు, బంగారు నగలు కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంపై పంచాయతీ కార్యదర్శి ఉమానాథ్, పారిశుధ్య కార్మికులపై వెంగల్ ఎస్ఐ సెంథిల్కుమార్ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇప్పటి వరకు బాధిత కుటుంబానికి న్యాయం చేయలేదు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ మైనారిటీ విభాగం కార్యదర్శి వేలూరు సైదు ఇబ్రహీం బాధితులను పరామర్శించారు. కాలిపోయిన ఇంటిని పరిశీలించారు. తిరువళ్లూర్ జిల్లా కలెక్టర్తో మాట్లాడి బాధితులకు ప్రత్యామ్నాయ స్థలంతో పాటు ప్రభుత్వం తరపున వివిధ సంక్షేమ పథకాల సహాయం అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.


