తిరువళ్లూరు: పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ వైద్యవీరరాఘవుడి ఆలయంలో శుక్రవారం సాయంత్రం జ్యేష్టాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ ఆలయంలో ప్రతి ఏటా ఆషాడమాసం రెండవ శుక్రవారం రోజు సాయంత్రం జ్యేష్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా అభిషేకం కార్యక్రమానికి అవసరమైన నీటిని నాలుగు వెండి బిందెలు, ఒక బంగారు బిందెతో పుష్కరిణిలోని నీటిని శుక్రవారం ఉదయం ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం కనకవల్లి అమ్మవారికి శేష అభిషేకం చేశారు. సాయంత్రం జ్యేష్టాభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనే, కొబ్బరినీటితో అభిషేకం చేపట్టారు. ఏడాదికి ఒక్కరోజు మాత్రమే నిర్వహించే జ్యేష్టాభిషేకం కారణంగా శుక్రవారం ఉదయం, సాయంత్రం స్వామి వారి దర్శనాన్ని రద్దు చేశారు. స్వామి వారి దర్శనం శనివారం ఉదయం 6.15 గంటలకు ప్రారంభమవుతుందని అర్చకులు, ఆలయ నిర్వాహకులు వెల్లడించారు.


