మంత్రి రాజ్కుమార్
వేలూరు: డీటీసీపీ స్థలాలకు దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోనే భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని గృహ నిర్మాణ శాఖ మంత్రి రాజ్కుమార్ తెలిపారు. వేలూరు జిల్లా కాట్పాడిలోని వీఐటీ యూనివర్సిటీలో శుక్రవారం తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన ఇంజినీర్ల సమాఖ్య, వేలూరు సివిల్ ఇంజినీర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ప్రత్యేక సదస్సు నిర్వహించారు. దీనికి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తమన్ అధ్యక్షత వహించగా మంత్రి రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తాను మెకానికల్ ఇంజినీరింగ్ చదివినప్పటికీ సివిల్ ఇంజినీరింగ్ రంగంలో పనిచేశానని తెలిపారు. సివిల్ ఇంజినీర్లు ఎదుర్కొనే సమస్యలు తనకు బాగా తెలుసన్నారు. గతంలో భవన నిర్మాణాలకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే అనుమతి కోసం సంవత్సరం పట్టేదన్నారు. తమ ప్రభుత్వం నెల రోజుల్లోనే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పట్టణాభివృద్ధి రేటు 38 శాతంగా ఉందని, 2047 నాటికి ఈ సంఖ్య 50 శాతానికి పెరుగుతుందన్నారు. ప్రస్తుతం ఇంజినీర్లు తెలిపిన సమస్యలపై రానున్న బడ్జెట్ సమావేశంలో సానుకూల ప్రకటన వెలువడనుందన్నారు. వాస్తు శిల్ప రంగంలో తమిళులు అద్భుతమైన నైపుణ్యం కలిగిన వారని వెల్లడించారు. రెండు వేల సంవత్సరాల క్రితం నిర్మించిన గ్రాండ్ అనకట్టు దీనికి నిదర్శనమన్నారు. అనేక క ళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ కోర్సులు అందుబాటులో లేవన్నారు. ఇటువంటి సదస్సులను ఇంజినీర్లు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వీఐటీ ఉపాధ్యక్షులు శంకర్ విశ్వనాథన్, అసోసియేషన్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభు, రాష్ట్ర కార్యదర్శి అరుల్, కోశాధికారి కర్ణన్, ఉపాధ్యక్షులు వైద్య నాథన్, సంయుక్త కార్యదర్శి శివకుమార్, ఎమ్మెల్యేలు సుధాకర్, సిందు, తెండ్రల్కుమార్, వినోద్కన్నన్, వేలూరు సివిల్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విఎస్ అర్జునన్, డీటీసీపీ కమిటీ చైర్మన్ వెంకటేశన్, తదితరులు పాల్గొన్నారు.


