వేలూరు: క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం కలుగుతుందని, విద్యార్థినులు క్రీడల్లో రాణిస్తే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని కళాశాల కార్యదర్శి మేరీ జోస్ఫిన్ రాణి తెలిపారు. వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని అగ్జిలియమ్ మహిళా డిగ్రీ కళాశాల వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 20వ తేదీ నుంచి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ క్రమంలో కళాశాల ఆవరణంలో శుక్రవారం గెలుపొందిన విద్యార్థినులకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఆమె మాట్లాడుతూ యుక్త వయస్సులో విద్యార్థినులు విద్యతోపాటు క్రీడలపైనా ఆసక్తి చూపాలన్నారు. ప్రస్తుతం క్రీడా సర్టిఫికెట్లతో అనేక మంది ఉన్నత స్థానాలకు చేరారని, వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఫేస్బుక్, వాట్సాప్ల మోజులో పడకుండా విద్యపైనే దృష్టి పెట్టాలన్నారు. ఇక్కడున్న వారు అధికంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కావడంతో మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివిస్తున్నారని, వారిని ఒక్కసారి గుర్తించుకోవాలన్నారు. కళాశాల విద్య పూర్తి చేసుకొని వివాహాలు చేసుకున్నామా అని లేకుండా జీవితంలో ఏమి సాధించాము, ఏమి సాధించాలని ప్రశ్నించుకోవాలన్నారు. జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక లక్ష్యం ఉండాలని, ఆ లక్ష్యాన్ని అధిగమించేందుకు పట్టుదలతో ప్రయత్నం చేయాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరోగ్య జైసిలీ, డిప్యూటీ ప్రిన్సిపాల్ అమల వలర్మది, అబిబ్యూలా, తమిళ విభాగం డీన్ సెంథిల్ సెల్వి పాల్గొన్నారు.


