సాక్షి, చైన్నె: రైల్వే అత్యున్నత పరిపాలనా విభాగమైన రైల్వే బోర్డులో డైరెక్టర్ జనరల్ (రైల్వే హెల్త్ సర్వీసెస్ )గా నార్త్ వెస్టర్న్ రైల్వే చీఫ్ ప్రిన్సిపల్ మెడికల్ డైరెక్టర్గా డాక్టర్ ఓ. కృష్ణకుమార్ నియమితులయ్యారు. ఆయన ప్రతిభ, నాయకత్వ పటిమ , ప్రజాసేవలో చూపిన అంకితభావానికి ఈ నియామకం ఒక నిదర్శనంగా అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా నార్త్ వెస్టర్న్ రైల్వే జనరల్ మేనేజర్ పంకజ్ శర్మ ఆయనకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
డాక్టర్ కృష్ణకుమార్ నేపథ్యం..
కేరళ రాష్ట్రంలోని పలక్కాడ్ జిల్లాకు చెందిన కృష్ణకుమార్ చైన్నెలోని స్టాన్లీ మెడికల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్, మద్రాస్ మెడికల్ కాలేజ్ నుంచి ఎండీ పట్టా పొందారు. 1990 బ్యాచ్ ఇండియన్ రైల్వే హెల్త్ సర్వీస్) అధికారిగా 1991 ఆగస్టు 26న రైల్వే సర్వీస్లో చేరారు. విశిష్టమైన 3 దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో ఆయన భావ్నగర్, వడోదర తదితర ప్రాంతాలలో అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ నుండి వెస్టర్న్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ వరకు కీలక బాధ్యతలను నిర్వర్తించారు. వడోదరలో చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్గా పనిచేసిన సమయంలో మెరుగైన ఆరోగ్య సేవలు అందించినందుకు వెస్టర్న్ రైల్వే జనరల్ మేనేజర్ నుండి 3 సార్లు ’హెల్త్ సర్వీసెస్ ఎఫిషియన్సీ షీల్డ్ అందుకున్నారు.
తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం
తిరువొత్తియూరు: తిరుచ్చి పొన్మలై సమీపంలోని ఆలత్తూరైకి చెందిన రత్తినం భార్య తమిళక్కొడి (69). పది రోజుల క్రితం ఇంట్లో ప్రమాదవశాత్తు కింద పడటంతో తమిళక్కొడి ఎడమ కాలికి ఫ్రాక్చర్ అయింది. దీనికి చికిత్స కోసం ఆమెను తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. వారం క్రితం తమిళక్కొడికి శస్త్రచికిత్స పూర్తయింది. ఆ తర్వాత ఆమెను పాత భవనంలోని 500వ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తమిళక్కొడికి సహాయంగా ఆమె కుమారుడు అక్కడే ఉన్నాడు. గురువారం తెల్లవారుజామున మంచంపై పడుకుని ఉన్న తమిళక్కొడి ఎడమ కాలి బొటనవేలిని ఎలుక కొరకడంతో రక్తగాయమైంది. విషయం తెలుసుకున్న ఆసుపత్రి డీన్ కుమారవేల్ సంఘటనా స్థలానికి వచ్చి విచారణ జరిపారు. అలాగే వెంటనే తమిళక్కొడికి చికిత్స అందించారు. దీని తర్వాత తమిళక్కొడిని ఐసీయూ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఎలుక కొరకడం వల్ల వృద్ధురాలి కాలి బొటనవేలు గాయపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది.
బాలికలకు ఆత్మరక్షణ విద్య అత్యవసరం
కొరుక్కుపేట: బాలికలకు ఆత్మరక్షణ విద్య అత్యవసరమని రోటరీ క్లబ్ ఆఫ్ చైన్నె మైత్రి అధ్యకురాలు డాక్టర్ విద్యాహరి అయ్యర్ అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ చైన్నె మైత్రి ఆధ్వర్యంలో 1000 మందికి పైగా బాలికలకు ఆత్మరక్షణ వర్క్షాప్ గురువారం ఘనంగా నిర్వహించారు. చైన్నె గోపాలపురం లోని ఎం.డబ్ల్యూ.ఏ. మెట్రిక్యులేషన్ ఉన్నత మాధ్యమిక పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి రొటేరియన్ డాక్టర్ విద్యాహరి అయ్యర్ అధ్యక్షత వహించారు.ముఖ్య అతిథిగా రొటేరియన్ శాలిని దువ్వూరి, గౌరవ అతిథులుగా రొటేరియన్ నాగలక్ష్మి, రొటేరియన్ జయ సత్యలు పాల్గొని ఆత్మరక్షణ వర్క్షాప్ను ఆరంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ నానాటికీ బాలికలపై పెరిగిపోతున్న అఘాయిత్యాలు, దాడుల నుంచి వారిని వారు రక్షించుకునేలా అమ్మాయిలకు పాఠశాలలోనే ఆత్మ రక్షణ విద్య అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.


