సాక్షి, చైన్నె : ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తమ అత్యంత ప్రాధాన్యత కలిగిన వార్షిక సదస్సు ఇమేజిన్ 2026 కు ముందు చైన్నెలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గురువారం విజన్ 2030 రోడ్మ్యాప్ను ఆవిష్కరించింది. భారతదేశంలో లైవ్ ఎంటర్టైన్మెంట్, డెస్టినేషన్ వెడ్డింగ్స్, బిజినెస్ ఈవెంట్స్, ఎగ్జిబిషన్లు , సాంస్కృతిక, టూరిజం రంగాలు శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆగస్టు 7 నుండి 9 వరకు చైన్నెలోని ఐటీసీ గ్రాండ్ చోళా వేదికగా ఇమేజిన్ 2026 సదస్సును నిర్వహించనున్నట్టు ప్రకటించారు. భారతదేశాన్ని ప్రపంచ ఎక్స్పీరియన్స్ క్యాపిటల్ గా నిలబెట్టడమే తమ ప్రధాన లక్ష్యమని ఆ అసోసియేషన్ అధ్యక్షుడు సమిత్ గార్గ్ తెలిపారు. అసోసియేషన్ సౌత్ వైస్ ప్రెసిడెంట్ వినోద్ గోపాల్ మాట్లాడుతూ... ఈ సదస్సు తొలిసారిగా చైన్నెలో జరగడం దక్షిణ భారత ఈవెంట్ రంగానికి ఒక గొప్ప మైలురాయిగా వివరించారు. ప్రపంచ స్థాయి ఈవెంట్లను నిర్వహించేందుకు అవసరమైన మౌలిక వసతులు, కళాకారులు, సాంస్కృతిక మూలాలు తమిళనాడులో పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు.. ఈ సదస్సు ద్వారా 800 మందికి పైగా పరిశ్రమ దిగ్గజాలు, నిర్ణయాధికారులు చైన్నెకి రానున్నారని తెలిపారు.ఈఈఎంఏ వ్యవస్థాపక సభ్యుడు సిద్ధార్థ్ గణేరివాలా మాట్లాడుతూ ఈ సదస్సులో వ్యాపార వృద్ధి – విధానాలు, అధునాతన సాంకేతికత – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సుస్థిరత – పర్యావరణ పరిరక్షణ , నైపుణ్యాభివృద్ధి – గ్లోబల్ ప్రాక్టీసెస్ గురించి చర్చించనున్నామని వివరించారు.


