తిరుత్తణి: తిరుత్తణిలో ఆదివారం సాయంత్రం గాలీవాన బీభత్సం సృష్టించింది. కొండ ఆలయంలో ఇనుప క్యూల పందెళ్లు కూలడంతోపాటు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. తిరుత్తణి ప్రాంతంలో వారం రోజుల నుంచి ఎండల తీవ్రతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం నుంచి అగ్నినక్షత్రం ప్రారంభం కానుండడంతో జనం తీవ్ర ఆందోళన చెందారు. ఈక్రమంలో ఆదివారం సాయంత్రం అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతోపాటు గాలీవాన తీవ్ర ప్రతాపం చూపింది. గంటలపాటు తేలికపాటి వర్షంతో పెనుగాలులు వీచాయి. దీంతో కొండ ఆలయంలో ఇనుప పందెళ్లు నేలకొరిగాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలడంతో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. వర్షంతో వేడితో తల్లడిల్లిన జనం కాస్త ఉపశమనం పొందారు. పట్టణంలో 3గంటలపాటు పట్టణంలో విద్యుత్ సేవలకు అంతరాయం చోటుచేసుకుంది.


