తిరుత్తణి: అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన ఓట్లు సోమవారం లెక్కించనున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గతనెల 23న పోలింగ్ నిర్వహించారు. పోలింగ్లో నమోదైన ఓట్లు ఈవీఎంలను రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో సీల్ వుంచి కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. తిరుత్తణి, తిరువళ్లూరు, గుమ్మడిపూండి, పొన్నేరి నియోజకవర్గాల్లో నమోదైన ఈవీఎంలను సెవ్వాపేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం లెక్కించనున్నారు. ఈక్రమంలో కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలకు రక్షణతోపాటు భద్రత పట్ల భరోసా కల్పించే విధంగా అవగాహన ర్యాలీ తిరుత్తణిలో శనివారం సాయంత్రం నిర్వహించారు. తిరుత్తణి ఏఎస్పీ శుభమ్ దిమాన్ ఆధ్వర్యంలో పోలీసుల బృందం స్థానిక ప్రధాన వీధుల్లో ర్యాలీగా వెళ్లి ప్రజలకు కౌంటింగ్ ప్రశాంతంగా వుండేందుకు సంబంధించి అవగాహన కల్పించారు.
పాలసముద్రం: మండలంలోని క్రిష్ణజమ్మాపురం పంచాయతీ బలిజకండ్రిగ గ్రామంలో వెలసిన చెవుటి గంగమ్మకు ఆదివారం పాలాభిషేకం, అంబలి పోసే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం అర్చకుడు ఆమ్మవారి ఎదుట కలశాన్ని ఏర్పాటుచేసి గణపతి హోమం, నవగ్రహ హోమం, శాంతి హోమం చేపట్టారు. హోమంలో ఉంచిన కలశాల నీటితో అమ్మవారిని అభిషేకించారు. 10 గంటలకు ప్రతి ఇంటి నుంచి మహిళలు అంబిలి, పాలు, పసుపు నీటి బిందెలతో నయ్యాడి వాయిద్యాలతో అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. వాటితో అమ్మవారికి అభిషేకాలు చేశారు. అనంతరం అమ్మవారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. సోమవారం పూలగెరిగను ఊరేగించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.


