తమిళసినిమా: చలన చిత్రానికి ఆరాధ్యుడైన థామస్ ఆల్వా ఎడిసన్ పేరును స్మరించుకునే విధంగా సెల్వకుమార్ ఎడిసన్ పేరుతో సినీ అవార్డుల వేడుకలను ఖాతా 17 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా 17వ వార్షిక ఎడిషన్ అవార్డుల వేడుకను ఈ నెల 24న స్థానిక నందంబాక్కంలోని ట్రేడ్ సెంటర్లో బ్రహ్మాండంగా నిర్వహించతలపెట్టారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక వడపళనిలోని ఒక నక్షత్ర హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజకీయనేత, సామాజిక వేత్త వేల్మురుగన్, రాధారవి, అంబిక, డాక్టర్ సీఎంకే రెడ్డి పాల్గొన్నారు. సీఎంకే రెడ్డి మాట్లాడుతూ ఈ ఎడిసన్ అవార్డుల వేడుకలను మరో 30 ఏళ్ల పాటు నిర్వహిస్తారని అన్నారు. తాను ఇటీవల యూఎస్ఏ వెళుతున్న సమయంలో ఒక్క నిమిషం నిడివి గల షార్ట్ ఫిలిం చూశానన్నారు. అందులో ఒక వ్యక్తి లోకల్ ట్రైన్లో పయనిస్తుండగా సిగరెట్ తాగాలనిపించడంతో జేబులో సిగరెట్ లేకపోవడంతో ఒక స్టేషన్లో రైలు ఆగగా రైలు దిగి ఎదురుగా ఉన్న దుకాణంలో సిగరెట్లు కొనుక్కుని రైలు బయల్దేరడంతో పరిగెత్తి ఎక్కేశాడన్నారు. కొంత దూరం వెళ్లిన తరువాత చేతిలో బ్యాగ్ లేకపోవడం గమనించారన్నారు. ఆ బ్యాగ్ను సిగరెట్ కొన్న దుకాణంలో పెట్టి తీసుకోకుండా వచ్చేశాడన్నారు. ఇటువంటి వ్యసనాలతో కలిగే నష్టానికి ఇంతకంటే నిదర్శనం వేరే ఏముంటుందని సీఎంకే.రెడ్డి పేర్కొన్నారు.


