మహాకుంభాభిషేకంలో భక్తజనం
పళ్లిపట్టు: పొదటూరుపేటలో ఆర్ముగస్వామి ఆలయ మహాకుంభాభిషేకం గురువారం కనుల పండువగా నిర్వహించారు. పళ్లిపట్టు సమీపంలోని పొదటూరుపేట కొండపై ఆర్ముగస్వామి ఆలయానికి జీర్ణోద్ధరణ పనులు చేసి మహాకుంభాభిషేకం చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. అందులోభాగంగా కొత్తగా వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామికి ఆలయాలు, విమాన గోపురంతో, శిలలు ప్రతి ష్ఠించారు. దీంతో మంగళవారం నుంచి గురువారం వరకు మూడు రోజుల పాటు మహాకుంభాభిషేకం వేడుకలు నిర్వహించారు. ఇందులోభాగంగా గురువారం శివాచార్యుల బృందం పవిత్ర పుణ్యతీర్థాల కలశాలను ఊరేగింపుగా తీసుకెళ్లి మహాకుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మధ్యాహ్నం శ్రీవళ్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. సాయంత్రం శివపార్వతులు, వినాయకుడు, వళ్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఉత్సవర్లను పట్టణ వీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర హారతుపట్టి కొబ్బరికాయలు కొట్టి స్వామిని దర్శించుకున్నారు.


