సాక్షి, చైన్నె: చైన్నెలోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు ఒక క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. 10 ఏళ్ల బాలుడి గుండె, ఊపిరితిత్తుల మధ్య భాగంలో పెరిగిన సుమారు 900 గ్రాముల భారీ కణితిని అత్యంత నైపుణ్యంతో తొలగించారు. ఈ అరుదైన విజయం గురించి ఆస్పత్రి వైద్య బృందంలోని పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ ధినేష్ బాలాజీ డాక్టర్ నందిని, డాక్టర్ సెంథిల్ గణేష్, డాక్టర్ కార్తీక్ నారాయణన్ , డాక్టర్ సతీష్ చందర్ లు బుధవారం మీడియాకు వివరించారు. సదరు బాలుడు గత కొంతకాలంగా తరచూ ఛాతిలో ఇన్ఫెక్షన్లతో బాధపడుతూ రావడమే కాకుండా సాధారణ జలుబు, దగ్గుగా భావించినప్పటికీ సమస్య తగ్గకపోవడంతో ఆసుపత్రిలో చేరినట్టు వివరించారు. పరిశోధనలో బాలుడి ఛాతిలో ఒక భారీ కణితి ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని 75 శాతం మేర తగ్గించడమే కాకుండా, గుండైపె తీవ్ర ఒత్తిడి కలిగిస్తున్నట్టు గుర్తించామన్నారు. పరిశోధనలో ఆల్ఫా–ఫెటోప్రోటీన్ స్థాయిలు 2,68,000 (సాధారణంగా 10 కంటే తక్కువ ఉండాలి) ఉన్నట్లు తేలిందని, ఇది కణితి తీవ్రతను సూచించిందన్నారు. దీంతో సాధారణంగా గుండె ఆపరేషన్లకు ఉపయోగించే ’స్టెర్నోటమీ’ పద్ధతిలో ఛాతిని తెరిచి, అతి క్లిష్టమైన ఈ సర్జరీని నిర్వహించామన్నారు. గుండెకు, ప్రధాన రక్తనాళాలకు ఎటువంటి హాని కలగకుండా కిలో బరువున్న కణితిని తొలగించామన్నారు. ఆ బాలుడు ఆరోగ్యంగా ఉన్నట్టు పేర్కొన్నారు.


