ముగిసిన విశ్రాంతి! | - | Sakshi
Sakshi News home page

ముగిసిన విశ్రాంతి!

Apr 30 2026 7:55 AM | Updated on Apr 30 2026 7:55 AM

–చైన్నెకి సీఎం స్టాలిన్‌

సాక్షి, చైన్నె: కొడైకెనాల్‌లో 4 రోజుల విశ్రాంతి తదుపరి బుధవారం సీఎం స్టాలిన్‌ చైన్నెకు చేరుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాస్త విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతో ఏప్రిల్‌ 25న సీఎం స్టాలిన్‌ తన కుటుంబ సభ్యులతో చైన్నె నుండి ప్రత్యేక విమానంలో మధురై చేరుకుని, అక్కడి నుండి కారులో కొడైకెనాల్‌కు వెళ్లారు. అక్కడ పాంబార్‌పురంలోని ఒక ప్రైవేట్‌ రిసార్ట్‌లో బస చేశారు. పర్యటనలో భాగంగా రోజూ ఉదయం ముఖ్యమంత్రి వాకింగ్‌ చేస్తూ స్థానిక ప్రజలు, పర్యాటకులతో ముచ్చటించారు. వారితో కలిసి ఫొటోలు కూడా దిగారు. మంగళవారం ఆయన ఒక ప్రైవేట్‌ మ్యూజియాన్ని సందర్శించారు.

ఆధ్యాత్మికం

సీఎం స్టాలిన్‌ సతీమణి దుర్గా స్టాలిన్‌ ఇతర కుటుంబ సభ్యులు కొడైకెనాల్‌లోని కురింజి ఆండవర్‌ ఆలయం, మారియమ్మన్‌ ఆలయం, పూంబా రై కుళందై వేలప్పర్‌ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే వారు కొడై లేక్‌లో బోటు షికారు చేస్తూ గడిపారు. ఇక తన పర్యటనలో భాగంగా మంత్రులు ఐ. పెరియ స్వామి, చక్రపాణిలతో పాటూ డీఎంకే ముఖ్య నేతలతో స్టాలిన్‌ భవిష్యత్‌ ప్రణాళికలపై చర్చించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం, బుధవారం ఉదయం 8.50 గంటలకు కొడైకెనాల్‌ నుండి కారులో బయలుదేరి మధురై విమానాశ్రయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మధురై నుండి ప్రత్యేక విమానంలో ఆయన చైన్నెకి బయలుదేరి వచ్చేశారు. సీఎం పర్యటన దృష్ట్యా కొడైకెనాల్‌ మార్గంలో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

స్టాలిన్‌ వద్దకు ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌?

గత నాలుగు రోజులుగా కొడైకెనాల్‌లోని ఆహ్లాదకర వాతావరణంలో గడిపిన స్టాలిన్‌, రాజకీయ ఒత్తిళ్లకు దూరంగా చాలా ఉల్లాసంగా కనిపించారు. తనను కలిసిన మంత్రులతో మాట్లాడుతూ.. ఈ సెలవులు తనలో కొత్త శక్తిని నింపాయని, శారీరకంగా, మానసికంగా రిఫ్రెష్‌ అయినట్లు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. స్టాలిన్‌ విశ్రాంతిలో ఉన్నప్పటికీ, ఎన్నికల ఫలితాలపై జాతీయ స్థాయి అంచనాలపై నిరంతరం దృష్టి పెట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. డీఎంకే ఒంటరిగా శ్రీమ్యాజిక్‌ ఫిగర్‌శ్రీ సాధిస్తుందని కేంద్ర హోంశాఖ వర్గాలు అంచనా వేస్తున్నట్లుగా, ఇందుకు సంబంధించిన ఇంటెలిజెన్స్‌ నివేదిక స్టాలిన్‌కు చేరినట్టు సమాచారం. ఈ ఉత్సాహంతోనే చైన్నె చేరుకున్న స్టాలిన్‌, తదుపరి ప్రభుత్వంలో తన మంత్రివర్గ సహచరులు ఎవరు ఉండాలి? ఏయే శాఖల్లో మార్పులు చేయాలి? అనే దానిపై ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు చర్చ ఊపందుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement