అధికారుల అన్వేషణ
తిరువళ్లూరు: చైన్నె ప్రజలకు తాగునీటిని అందించే ప్రధాన రిజర్వాయర్ల నీటి మట్టం వేగంగా తగ్గుతున్న క్రమంలో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించారు. చైన్నె ప్రజలకు తాగునీటిని అందించే ప్రధాన రిజర్వాయర్లో పూండి సత్యమూర్తి సాగర్, పుళల్, చోళవరం, చెమరంబాక్కం, తేరువాయి కండ్రిగ–కన్నన్కోటై ప్రధాన రిజర్వాయర్లు వున్నాయి. కండలేరు రిజర్వాయర్ నుంచి వచ్చే కృష్ణాజలాలను పూండి రిజర్వాయర్లో నిల్వ వుంచి అక్కడ నుంచి చోళవరం, చెమరంబాక్కం, పుళల్ రిజర్వాయర్లకు నీటిని తరలించి అక్కడ శుద్ధీకరణ చేసిన తరువాత చైన్నె ప్రజల తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తున్నారు. అయితే ఇటీవల ఎండలు మండుతున్న క్రమంలో రిజర్వాయర్ల నీటి మట్టం తగ్గుతోంది. దీంతో అధికారులు వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ప్రత్యామ్నయ చర్యలపై దృష్టి సారించారు. పూండి సత్యమూర్తి సాగర్ రిజర్వాయర్ నీటి మట్టం మొత్తం 35 అడుగులు కాగా ప్రస్తుతం 31 అడుగుల మేరకు నీరు ఉంది. అదేవిధంగా చెమరంబాక్కం రిజర్వాయర్ మొత్తం నీటి మట్టం 24 అడుగులు కాగా ప్రస్తుతం 21.37 అడుగుల నీరు నిల్వ వుంది. అలాగే పుళల్ రిజర్వాయర్ నీటి మట్టం మొత్తం 21 అడుగులు కాగా ప్రస్తుతం 14.72 అడుగుల నీరు నిల్వ ఉంది. చోళవరం రిజర్వాయర్ మొత్తం నీటి మట్టం 18.86 అడుగులు కాగా ప్రస్తుతం 11.77 అడుగుల నీరు నిల్వ వుంది.


