మంత్రి నెహ్రూపై కేసు నమోదుకు ఆదేశించలేదు | - | Sakshi
Sakshi News home page

మంత్రి నెహ్రూపై కేసు నమోదుకు ఆదేశించలేదు

Apr 29 2026 8:00 AM | Updated on Apr 29 2026 8:00 AM

● మద్రాసు హైకోర్టు స్పష్టీకరణ

సాక్షి, చైన్నె: పురపాలక, నగరాభివృద్ధి శాఖలో జరిగిన అవకతవకల వ్యవహారంలో మంత్రి కే.ఎన్‌. నెహ్రూపై నేరుగా కేసు నమోదు చేయాలని తాము ఆదేశించలేదని, కేవలం ఆ అక్రమాలపై మాత్రమే దర్యాప్తునకు ఆదేశించామని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. కాగా పురపాలక, నగరాభివృద్ధి శాఖలో 2,538 మంది అసిస్టెంట్‌ , జూనియర్‌ ఇంజినీర్ల నియామకాల్లో సుమారురూ.634 కోట్ల మేరకు లంచం చేతులు మారినట్టుగా ఆరోపణలు ఇటీవల వెల్లువెత్తాయి. ఈడీ దాడులలో లభించిన సమాచారం ఆధారంగా విచారణ నిమిత్తం డీజీపికి రాసిన లేఖతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీని ఆధారంగా అన్నాడీఎంకే ఎంపీ ఇన్బదురై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ. ధర్మాధికారి, జస్టిస్‌ జి. అరుల్‌ మురుగన్‌ నేతత్వంలోని ధర్మాసనం ఈ కేసును మంగళవారం విచారించింది. తన వాదనలు వినకుండానే కేసు నమోదుకు ఆదేశాలు ఇచ్చారని మంత్రి నెహ్రూ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.ఈసందర్భంగా న్యాయమూర్తులు స్పందిస్తూ తాము మంత్రిపై కేసు నమోదు చేయాలని ఎక్కడా పేర్కొనలేదన్నారు. కేవలం జరిగిన అవకతవకలపై మాత్రమే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయమని చెప్పినట్టు న్యాయమూర్తులు స్పష్టం చేశారు.

వేసవి సెలవుల తర్వాతే విచారణ

ఈ కేసులో లోతైన విచారణ అవసరమని భావించిన న్యాయమూర్తుల బెంచ్‌ తదుపరని విచారణను జూన్‌ 4వ వారానికి వాయిదా వేసింది. అదే సమయంలో కేసు నమోదుపై స్టే ఇవ్వాలని మంత్రి తరపు న్యాయవాదులు కోరగా, ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోమని బెంచ్‌ స్పష్టం చేసింది.

నెహ్రూ

Advertisement
 
Advertisement
Advertisement