సాక్షి, చైన్నె: నిర్మాణ రంగంలో సరకొత్త విప్లవానికి నాంది పలికే విధంగా స్లేట్ ఏఐ అనే కత్రిమ మేధా సాంకేతికతను ప్రవేశ పెట్టేందుకు డీఆర్ఏ సంస్థ నిర్ణయించింది. ఇందులో భాగంగా మంగళవారం కాలిఫోర్నియాకు చెందిన స్లేట్ టెక్నాలజీతో డీఆర్ఏ చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యం గురించి డీఆర్ఏ ఎండీ రంజీత్రాథోడ్ మీడియాకు వివరించారు. సాధారణంగా నిర్మాణ రంగంలో పనులు ఎలా జరుగుతున్నాయో అనే నివేదికలు పాత పద్ధతిలో ఉంటాయని, అయితే, స్లేట్ ఏఐ వాడకం వలన ప్రాజెక్టు పనులు ముందే ప్లాన్ చేయడం, నాణ్యతను పెంచడం, వేగంగా పూర్తి చేయడం సాధ్యమవుతుందన్నారు. నిర్మాణ స్థలాల్లో వేర్వేరు భాషలు మాట్లాడే కార్మికులు ఉంటారని,ఈ ఏఐ వేదిక వాస్తవిక సమయాలలో వివిధ భాషల్లో సమాచారాన్ని అందిస్తూ టీమ్స్ మధ్య సమన్వయాన్ని సులభతరం చేస్తుందన్నారు. నాణ్యత తనిఖీలు, సేఫ్టీ అనలిటిక్స్ వంటి పనుల్లో జాప్యం జరగకుండా ముందుగానే అంచనా వేయడం వంటి అంశాల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రస్తుతం చైన్నెలోని సుమారు 33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జరుగుతున్న డీఆర్ఏ ప్రాజెక్టులలో ఈ కొత్త సాంకేతికతను అమలు కేస్తున్నామని ప్రకటించారు. ఇది 2,000 మంది కార్మికులు , 100 మంది సాంకేతిక సిబ్బందికి సహాయకారిగా ఉంటుందన్నారు.


