– కొడైకెనాల్
పర్యటనలో ఆసక్తి
సాక్షి, చైన్నె: కొడైకెనాల్లో సీఎం స్టాలిన్ సోమవారం పర్యాటకులతో ముచ్చటించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత, సీఎం స్టాలిన్ తన కుటుంబంతో కలిసి 5 రోజుల విశ్రాంతి కోసం కొడైకెనాల్కు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా రెండవ రోజైన సోమవారం కొడైకెనాల్ మున్సిపాలిటీకి ప్రధాన నీటి వనరు అయిన మనోరంజితం రిజర్వాయర్ పరిసరాల్లో ఆయన సుమారు గంటసేపు వాకింగ్ చేశారు. సీఎం వాకింగ్ చేస్తున్నారని తెలుసుకున్న పర్యాటకులు, స్థానికులు ఆయనను చూసేందుకు రిజర్వాయర్ వెలుపల భారీగా తరలివచ్చారు. వాకింగ్ ముగించుకుని కారులో వెళ్తున్న సీఎం, ప్రజల ఉత్సాహాన్ని చూసి కారు ఆపి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా పర్యాటకులు ఆయనతో సెల్ఫీలు దిగి ఆనందం వ్యక్తం చేశారు. కాగా, సీఎం సతీమణి దుర్గా స్టాలిన్ ప్రసిద్ధ కురింజి ఆండవర్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం సీఎం స్టాలిన్ తన కుటుంబ సభ్యులతో కలిసి కొడైకెనాల్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించడంతో పాటూ నక్షత్ర సరస్సులో బోటింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా ఎన్నికల హడావుడి తర్వాత సీఎం తన సాధారణ రాజకీయ కార్యక్రమాలకు దూరంగా, కేవలం కుటుంబంతో గడిపేందుకే ఈ పర్యటనను కేటాయించారు. కొడైకెనాల్లోని చల్లని వాతావరణం మధ్య ఆయన ఉల్లాసంగా కనిపిస్తున్నారు.


