సాక్షి, చైన్నె : ఎన్నికల నామినేషన్ ప్రమాణ పత్రం విషయంగా దాఖలైన పిటిషన్లను మద్రాసు హైకోర్టు తిరస్కరించింది. దీంతో టీవీకే అధినేత విజయ్, అన్నాడీఎంకే మాజీ మంత్రులు సీవీ షణ్ముగం, డి జయకుమార్లకు కేసుల నుంచి ఊరట కలిగినట్లయ్యింది. వివరాలు.. రాయపురంలో పోటీ చేసిన డి. జయకుమార్కు 2021లో రూ. 39.14 లక్షలుగా ఉన్న ఆస్తులు, 2026 నాటికి రూ. 70.73 లక్షలకు పెరిగాయని, ఈ పెరుగుదలపై ఆదాయపు పన్ను శాఖ విచారణ జరపాలని ప్రవీణ్ కుమార్ అనేఓటరు పిటిషన్ వేశారు. అలాగే మైలంలో పోటీ చేసిన సి.వి. షణ్ముగంకు గత ఐదేళ్లలో చరాస్తులు రూ. 12 లక్షల నుండి రూ. 60 లక్షలకు పైగా పెరిగాయని, ఎమ్మెల్యే ఆదాయానికి మించి ఈ పెరుగుదల ఉందని సెంథిల్ కుమార్ అనే ఓటరు కోర్టును ఆశ్రయించారు. అలాగే, విజయ్ తన భార్య సంగీతకు రూ. 12.6 కోట్ల అప్పు ఇచ్చినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారని, దీనిపై విచారణ జరపాలని మరొక పిటిషన్ దాఖలైంది. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ. ధర్మాధికారి, జస్టిస్ జి. అరుల్ మురుగన్తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై వేర్వేరుగా విచారించింది. గతంలో ఇటువంటి అభ్యర్థనలతో వచ్చిన కేసులను కొట్టివేసిన దృష్ట్యా, ఈ పిటిషన్లను కూడా తిరస్కరించారు. దీంతో ఆముగ్గురికి కేసుల నుంచి ఊరట కలిగినట్లయ్యింది.


