కొరుక్కుపేట: సర్ త్యాగరాయ కళా పరిషత్, ఉత్తర మద్రాసు ఉగాది మహోత్సవ కార్యనిర్వాహక వర్గం సంయుక్త ఆధ్వర్యంలో సర్ పిట్టి త్యాగరాయశ్రేష్టి 175వ జయంతిని చైన్నె పాత చాకలి పేటలో ఘనంగా నిర్వహించారు. ముందుగా సమాజ సభ్యులు మన్నప్ప మొదటి వీధిలో ఉన్న సర్ త్యాగరాయ మహోన్నత పాఠశాల నుంచి ఊరేగింపుగా టీహెచ్ రోడ్డులోని సర్ త్యాగరాయ ఉద్యానవనం వద్దకు చేరుకున్నారు. అక్కడే ఉన్న ఆయన విగ్రహానికి సమాజం అధ్యక్షుడు డాక్టర్ పి.నందివర్మన్, ఉత్తర మద్రాసు ఉగాది మహోత్సవ కమిటీ అధ్యక్షుడు, సంగీత గాయకుడు ఎంఆర్ సుబ్రమణ్యం పుష్పాంజలి ఘటించారు. తదనంతరం సర్ త్యాగరాయ కళాశాలలోని పెద్ద సర్ పిట్టి త్యాగరాయశ్రేష్టి, చిన్న సర్ పిట్టి త్యాగరాయశ్రేష్టి విగ్రహాలకు జక్కుల హరికృష్ణ, కోణంకి జనార్దనం, మన్ని వెంకటేశ్వర్లు, కేబీ సతీష్కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే కళాశాల అభివృద్ధికి తోడ్పడిన పమ్మిరామస్వామి మూర్తులకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మద్రాసు నగరం ప్రప్రథమ మేయర్ సర్ పిట్టి త్యాగరాయ శ్రేష్టి మన తెలుగు వారైనందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉందని కొనియాడారు.


