ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన అధికారులు
పోలింగ్ కేంద్రాలకు చేరిన ఈవీఎంలు
కేంద్రపాలిత ప్రాంతంలో నిఘా కట్టుదిట్టం
పుదుచ్చేరిలో
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో
గురువారం పోలింగ్ జరగనుంది. ఓటింగ్ నిమిత్తం ఎన్నికల యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. కాగా ఈవీఎంలు, వీవీ ప్యాడ్లు, కంట్రోల్ పానల్స్ ఆయా పోలింగ్ కేంద్రాలకు బుధవారం
సాయంత్రానికి చేరుకున్నాయి. ఎన్నికల నిమిత్తం అన్ని చోట్లా భద్రతను
కట్దుదిట్టం చేశారు.
సాక్షి, చైన్నె: ముప్పై అసెంబ్లీ స్థానాలతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల సమరం తారా స్థాయికి చేరింది. ఇక్కడ ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత ఎన్ రంగస్వామి నేతృత్వంలో బీజేపీ, అన్నాడీఎంకే, లక్ష్య జననాయగ కట్చిలతో ఎన్డీఏ కూటమితో ఎన్నికల్ని ఎదుర్కొంటున్నాయి. అధికార ఎన్ఆర్ కాంగ్రెస్ను గద్దె దించడమే లక్ష్యంగా వైద్యలింగం నేతృత్వంలో కాంగ్రెస్, డీఎంకే, వీసీకేతో కూడిన ఇండియా కూటమి ఎన్నికల్లో పోరాడుతున్నాయి. ఇక విజయ్ టీవీకే, సీమాన్ నామ్ తమిళర్ కట్చి వేర్వేరుగా ఎన్నికల్లో నిలిచాయి. చతర్ముఖ సమరంగా ఇక్కడ ఎన్నికల ప్రచార రేసు సాగింది. మంగళవారంతో ప్రచారం ముగియడంతో పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. ఈ ఎన్నికలలో మొత్తం 294 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో జాతీయ పార్టీల నుండి 34 మంది, ప్రాంతీయ పార్టీల నుండి 63 మంది, రిజిస్టర్డ్ పార్టీల నుండి 80 మంది, 117 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
భద్రత కట్టుదిట్టం
పుదుచ్చేరిలోని ఠాగూర్ ఆర్ట్స్ కాలేజీ, మోతీలాల్ నెహ్రూ పాలిటెక్నిక్ వంటి ప్రాంతాలలోని స్ట్రాంగ్ రూమ్ల నుండి ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్లు , వీవీప్యాట్ యంత్రాలను అధికారులు ఉదయాన్నే బయటకు తీశారు. జీపీఎస్ అమర్చిన వాహనాల ద్వారా తుపాకీ పహారా నడుమ ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించే పనులు చేపట్టారు. 1,099 పోలింగ్ కేంద్రాలకు ఆ సంఖ్యకు తగినట్టుగా ఈవీఎం, వీవీప్యాట్, కంట్రోల్ పానల్స్ను పంపించారు. అదనంగా అత్యవసర పరిస్థితుల కోసం 364 ఈవీఎంలను సిద్ధంగా ఉంచారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్ కెమెరాలను అమర్చి, కంట్రోల్ రూమ్ నుండి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు మూడంచెల భద్రతను చేపట్టారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎండ వేడిమి దృష్ట్యా, పోలింగ్ కేంద్రాల వద్ద షామియానాలు ఏర్పాటు చేసి, వాటి కింద కుర్చీలను ఉంచారు. అలాగే తాగునీటి సౌకర్యం కల్పించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థులకు కట్టుదిట్టమైన కట్టుబాట్లు విధించారు. పాస్లు ఉన్న వారినేలోనికి అనుమతించనున్నారు. ఆయా పార్టీల ఏజెంట్లు ఉదయం ఆరు గంటలకంతా పోలింగ్ కేంద్రాలకు చేరుకునే విధంగా ఆదేశాలు జారీ అయ్యాయి. నగదు బట్వాడాపై నిఘా కట్టుదిట్టం చేశారు. తనిఖీలు ముమ్మరం చేపట్టారు. నగదు పంచుతున్న ఐదుగుర్ని అరెస్టు చేశారు. కాగా, ఎండ వేడిఅధికంగా ఉన్న దృష్ట్యా,చిన్న పిల్లలను పోలింగ్ కేంద్రాలకు తీసుకు రావద్దు అని ఓటర్లకు ఎన్నికల అధికారులు విన్నవించారు. ఓటింగ్ దృష్ట్యా గురువారం పుదుచ్చేరి, యానాం, మాగే, కారైక్కాలు మాగాణాల సైతం సెలవు ప్రకటించారు. పుదుచ్చేరిలోని జిప్మర్ ఆసుపత్రిలో ఓపీ సేవలను రద్దు చేశారు.
ఓటింగ్కు సన్నద్దం:
పుదుచ్చేరిలో మొత్తం 9,50,311 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 5.03 లక్షల మంది మహిళలు, 4.4 లక్షల మంది పురుషులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30 నియోజకవర్గాల్లో మొత్తం 1,099 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాలలో గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనున్నది. ఈ ఓటింగ్ నిమిత్తం ఈవీఎంలు,వీవీ ప్యాడ్, కంట్రోల్ పానల్స్ను ఎన్నికల సిబ్బంది ఆయా పోలింగ్కేంద్రాలకు చేర్చారు. అన్ని పోలింగ్ కేంద్రాలను సీసీ కెమెరాల నిఘా నీడలోకి తీసుకొచ్చారు. ఎన్నికల విధులలో 4 వేల మంది సిబ్బంది నిమగ్నమయ్యారు.


