తిరువొత్తియూరు: భర్త నుండి విడిపోయి జీవిస్తున్న మహిళపై దాడి చేసిన భర్త, అతని స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. చైన్నె ఎం.జి.ఆర్. నగర్లో తన భర్త రాజేష్ నుండి విడిపోయిన మహిళ గత 3 సంవత్సరాలుగా ఈశ్వరి (32) కుమార్తెతో కలిసి తల్లిదండ్రుల ఇంట్లో నివసిస్తున్నారు. ఈమె గిండిలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, గత 28వ తేదీ రాత్రి ఈశ్వరి ఇంటికి వచ్చిన రాజేష్ విమల్రాజ్ ఈశ్వరికి హత్య బెదిరింపులు ఇచ్చారు. దీనిని అడ్డుకున్న ఆమె తండ్రి, సర్దిచెప్పడానికి వచ్చిన ఈశ్వరి పినతండ్రి, ఈశ్వరి పై దాడి చేసి పారిపోయారు. దీనిపై ఫిర్యాదు మేరకు ఎంజీఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు మూలైపల్లంకు చెందిన రాజేష్ (38), అతని స్నేహితుడు విమల్రాజ్ (48)ను ఆదివారం అరెస్టు చేశారు.
తిరుత్తణి: అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం సోమవారం ప్రారంభం కావడంతో నామినేషన్ల కేంద్రాల వద్ద సందడి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు 23న పోలింగ్ నిర్వహించనున్న క్రమంలో సోమవారం నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. తిరుత్తణి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు సందర్భంగా ఏఎస్పీ శుభమ్ దిమాన్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. కార్యాలయానికి వెళ్లేవారిని తనిఖీ చేపట్టిన తరువాతే అనుమతించారు. అభ్యర్ధితోపాటు నలుగురికి మాత్రమే లోపలికి వెళ్లేందుకు అనుమతిచ్చారు. తొలిరోజు నామ్ తమిళర్ పార్టీ అభ్యర్థి చంద్రన్ నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా మరో ముగ్గురు సహా మొత్తం నలుగురు నామినేషన్లు ఎన్నికల అధికారి కనిమొళి వద్ద దాఖలు చేశారు.
తిరువొత్తియూరు: ఐపీఎల్ 20 ఓవర్ల క్రికెట్ పోటీలో చైన్నె చెపాక్ మైదానంలో 7 మ్యాచ్లు జరుగుతాయి. వచ్చే 3వ తేదీ (శుక్రవారం) జరిగే తొలి మ్యాచ్లో చైన్నె సూపర్ కింగ్స్–పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఈ పోటీకి సంబంధించిన టిక్కెట్ల విక్రయం సోమవారం ఆన్లైన్ ద్వారా ఉదయం 10.15 గంటలకు ప్రారంభమైంది. విక్రయం ప్రారంభం నుండే లక్షకు పైగా ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి వేచి ఉన్నారు. టిక్కెట్ల విక్రయం చాలా జోరుగా జరిగింది. రూ.2 వేలు, రూ.3,500, రూ.4 వేలు, రూ.4,700, రూ.8 వేలు ధరలలో టిక్కెట్ల ధరలు నిర్ణయించబడ్డాయి. విక్రయం ప్రారంభమైన సమయం నుండే రూ.2 వేలు, గంటలో రూ.3,500, రూ.4 వేలకు సంబంధించిన టిక్కెట్లు అమ్ముడైపోయాయి. అదేవిధంగా రూ.4,700, రూ.8 వేలకు సంబంధించిన టిక్కెట్లు కూడా త్వరలోనే అమ్ముడైపోతాయని తెలిపారు.
సాక్షి, చైన్నె: అమ్మమక్కల్ మున్నేట్ర కళగం టీటీవీ దినకరన్కు కుక్కర్ చిహ్నం దక్కింది. ఆయన పార్టీ గతంలో కుక్కర్ చిహ్నంలోనే పోటీచేస్తూ వచ్చింది. అయితే ప్రతి ఎన్నికలలో ఈచిహ్నం కోసం పోరాటం తప్పడం లేదు. తాజాగా అన్నాడీఎంకే, బీజేపీ ఎన్డీఏ కూటమిలో 11 స్థానాలలో టీటీవీ దినకరన్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. దీంతో వీరందరికి కామన్గా కుక్కర్ చిహ్నం దక్కింది. అదే సమయంలో ఈ పార్టీ అభ్యర్థులు పోటీలో లేని చోట్ల కుక్కర్ చిహ్నం స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించనున్నడంతో కూటమి పార్టీలకు కలవరం తప్పడం లేదు. ఇక డీఎంకే కూటమిలో 8చోట్ల వీసీకే పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆపార్టీకి కుండ చిహ్నంను ఎన్నికల కమిషన్ కేటాయించింది.
తిరువొత్తియూరు: చైన్నె మైలాపూర్ కపాలీశ్వర స్వామి ఆలయంలో పంగుణి ఉత్సవాలు గత 23వ తేదీన ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉత్సవాలలో ముఖ్య ఘట్టమైన రథోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. 96 అడుగుల ఎత్తు, 300 టన్నుల బరువైన తేరులో కపాలీశ్వరర్, కర్పగాంబాల్ కొలువై విహరించారు. రథాన్ని శంభో మహాదేవా అంటూ పెద్దఎత్తున భక్తులు లాగారు. అలాగే ఈ ఉత్సవంలో మరో ముఖ్య ఘట్టమైన అరుబత్తు మూవర్ (63 మంది నాయనార్లు) ఉత్సవం సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ప్రారంభమైంది వెండి విమానంలో శివపెరుమాన్ స్వామి, 63 నాయన్మార్లతో కలిసి ప్రదక్షిణ, ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలు కొనసాగింపుగా (బుధవారం) రాత్రి 8.30 గంటలకు తిరుకల్యాణ ఉత్సవం. 3వ తేదీన ఉత్సవ ముగింపు తిరుముళుకు (తీర్థవారి) జరగనుంది. 10వ తేదీన ఉత్సవాలు ముగుస్తాయని అధికారులు తెలిపారు.


