కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో తరలిరావడంతో రద్దీ కనిపించింది. ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. దర్శనం కోసం క్యూ లైన్లు పొడవుగా ఏర్పడగా, గంటల తరబడి భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. క్యూలైన్ల నిర్వహణ, తాగునీరు, శానిటేషన్ వంటి సదుపాయాలు కల్పించారు. భద్రతా ఏర్పాట్లను కూడా కట్టుదిట్టం చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించారు. మొత్తానికి భారీ రద్దీ ఉన్నప్పటికీ అధికారులు సమన్వయంతో వ్యవహరించడంతో భక్తులు సజావుగా దర్శనం చేసుకున్నారు.


