సాక్షి, చైన్నె: శాసనసభ ఎన్నికల నిర్వహణలో భాగంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈవీఎంలు చేరాయి. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో కంప్యూటర్ రాండమైజేషన్(లాటరీ)పద్ధతిలో ఎంపిక చేసి, కేటాయించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను నియోజకవర్గాలకు చేర్చారు.
పారదర్శక ప్రక్రియ
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కంప్యూటర్ ద్వారా ఏ యంత్రం ఏ నియోజకవర్గానికి వెళ్లాలో నిర్ణయించారు. ఈ యంత్రాలను సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లోని స్ట్రాంగ్ రూమ్లలో నిఘా నీడలో ఉంచారు. చైన్నెలో జిల్లా ఎన్నికల అధికారి జె. కుమరగురుబరన్ నేతృత్వంలో ఈ పంపిణీ ప్రక్రియ జరిగింది. ఇదే విధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్ల పర్యవేక్షణలో పనులు జరిగాయి. ఇక, ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలింగ్ అధికారులందరికీ ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో శనివారం ప్రత్యేక శిక్షణ తరగతులు జరిగాయి. ఓటింగ్ యంత్రాల నిర్వహణ, పోలింగ్ రోజున పాటించాల్సిన నిబంధనలపై వీరికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. అలాగే 100 శాతం ఓటింగ్ లక్ష్యంగా అవగాహణ కార్యక్రమాలు విస్తృతంగా జరిగాయి.
కట్టుదిట్టమైన భద్రత మధ్య
రాష్ట్రంలో 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 75,032 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇందులో 30,979 పట్టణ ప్రాంతాలలో, 44,065 రూరల్ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక 265 పోలింగ్ స్టేషన్లను ఎన్నికల నిమిత్తం మోడరన్గా తీర్చిదిద్దనున్నారు. మరో 258 స్టేషన్లను మహిళలే సారఽథులుగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 23వ తేదీన జరిగిన ఓటింగ్నిమిత్తం అన్ని నియోజకవర్గాలకు ఈవీఎం, వీవీ పాడ్, కంట్రోల్ పాన్ల్స్ను ఎన్నికల యంత్రాంగం సిద్ధం చేసింది. తనిఖీలు పూర్తి చేసుకున్న ఈవీఎంలు, వీవీప్యాట్, కంట్రోల్ పానల్స్ జిల్లా ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో నియోజక వర్గాలకు చేర్చారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలను ఏకం చేస్తూ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచారు. ఈ ఎన్నికల కోసం మొత్తం 90 వేల కంట్రోల్ యూనిట్లు, 90,000 ఈవీఎంలు, 97,500 వీవీప్యాట్ యంత్రాలను సిద్ధం చేశారు. సాంకేతిక లోపాలు తలెత్తితే తక్షణమే మార్చడానికి వీలుగా 20 శాతం యంత్రాలను అదనంగా ఉంచారు.


