సాక్షి, చైన్నె : 2026 అసెంబ్లీ ఎన్నికలలో డీఎండీకే దివంగత అధినేత, సినీ నటుడు, కరుప్పు ఎంజీఆర్ విజయకాంత్ కుటుంబానికి చెందిన ఇద్దరు పోటీ చేయనున్నారు. ఆయన సతీమణి ప్రేమలత విజయకాంత్, కుమారుడు విజయ ప్రభాకరన్ ఎన్నికలకు సిద్ధమయ్యారు. కరుప్పు ఎంజీఆర్గా తమిళుల హృదయాలలో సినీ నటుడు విజయకాంత్ ముద్ర వేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మరణం తర్వాత లోక్సభ ఎన్నికలను ప్రేమలత విజయకాంత్ నేతృత్వంలో ఆ పార్టీ ఎదుర్కొని, తమ ఓటు బ్యాంక్ను చేజారకుండా జాగ్రత్త పడింది. దీంతో తాజాగా డీఎంకే కూటమిలో ఆపార్టీకి 10 స్థానాలు కేటాయించారు. ఈసారి విజయకాంత్ ప్రతినిధులు అసెంబ్లీలో అడుగు పెట్టడమే లక్ష్యంగా ఎన్నికలలో స్వయంగా పోటీకి ఆయన సతీమణి, కుమారుడు సిద్ధమయ్యారు. విజయకాంత్ను ప్రపథమంగా అసెంబ్లీకి పంపించిన విరుదాచలం నియోజకవర్గం నుంచి ప్రేమలత విజయకాంత్ పోటీ చేయనున్నారు. వారసుడు విజయప్రభాకరన్ విరుదునగర్ నుంచి పోటీ చేయనున్నారు. లోక్ సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో విజయ ప్రభాకరన్కు కాంగ్రెస్ అభ్యర్థి మాణిక్యం ఠాకూర్ కన్నా అధిక ఓట్లు రావడం గమనార్హం. ఇక పల్లావరంలో డి. మురుగేశన్, తిరుత్తణి డి కృష్ణమూర్తి, ఓమలూరులో ఏఆర్ ఇలంగోవన్, మైలంలో మాజీ ఎమ్మెల్యే ఎల్ వెంకటేశన్, పోలూరులో టిపి శరవణన్, గుడియాత్తం(రి)లో కేబి ప్రతాప్, సేలం వెస్ట్లో మాజీ ఎమ్మెల్యే అలగాపురం ఆర్ మోహనరాజ్, ధర్మపురిలో డాక్టర్ వి ఇలంగోవన్లు పోటీ చేయనున్నారు. ఇక, డీఎంకే కూటమిలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్కు కేటాయించిన పాపనాశంలో షాజాహాన్, వాణియం బాడిలో సయ్యద్ ఫరూక్ను అభ్యర్థులుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖాదర్ మొహిద్దీన్ ప్రకటించారు. ఇక ఇదే కూటమిలోని మనిదనేయ జననాయక కట్చి అధ్యక్షుడు తమీమున్ అన్సారి చిదంబరం నియోజకవర్గంలో పోటీ చేయనున్నారు.


