సాక్షి, చైన్నె: బీహార్లో నితీష్ కుమార్కు పట్టిన గతే తమిళనాడులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామి పడుతుందని రవాణా మంత్రి శివశంకర్ హెచ్చరించారు. గురువారం చైన్నెలో మంత్రి మీడియాతో మాట్లాడారు. డీఎంకే కూటమి బలం, అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే కూటమి బలహీనతలను వివరిస్తూ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీకి బానిసగా..
ఒకప్పుడు ఉత్తర భారత పార్టీలు అన్నాడీఎంకే మద్దతు కోసం వేచి చూసేవని, అయితే ఇప్పుడు పళనిస్వామి ప్రతి చిన్న నిర్ణయం కోసం ఢిల్లీకి వెళ్లాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. అమిత్ షా ఇచ్చే స్క్రిప్ట్ను పళనిస్వామి మార్చకుండా చదువుతున్నారని విమర్శించారు. డీఎంకే కూటమిని బానిస కూటమి అని విమర్శించే అర్హత పళనిస్వామికి లేదన్నారు. ఆయన తన కూటమిలోని పార్టీలను ( పీఎంకే, ఏఎంఎంకే) కమలం గుర్తుపై పోటీ చేయించే స్థాయికి దిగజారినట్టు మండిపడ్డారు. తమిళనాడులో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చే బీజేపీకి పళనిస్వామి పెద్ద పీట వేశారని పేర్కొన్నారు.
జయలలిత ఆశయాలకు విరుద్ధం
మోదీయా – లేడియా? (మోదీనా లేక ఈ మహిళా?) అని బీజేపీకి సవాల్ విసిరిన దివంగత అమ్మ జయలలిత ఆశయాలను పళనిస్వామి సమాధి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మహారాష్ట్రలోని శివసేన, శరద్ పవార్ పార్టీల మాదిరిగానే అన్నాడీఎంకే కూడా చీలిపోయి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. డీఎంకే మిత్రులను ఎంతో గౌరవంగా చూస్తుందని, మర్యాద పూర్వంగా మెలుగుతుందని, అందుకే తమకూటమి బలంగా కొనసాగుతోందన్నారు.


