సాక్షి, చైన్నె: అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించే విధంగా 108 దేశాల బాలికల భాగస్వామ్యంతో ’మిషన్ శక్తిశాట్’ మస్కట్ను ఢిల్లీ వేదికగా ఆవిష్కరించడం జరిగిందని, చైన్నెలోని స్పేస్ కిడ్జి ఇండియా సీఈఓ డాక్టర్ శ్రీమతి కేసన్ ప్రకటించారు. ప్రపంచ అంతరిక్ష పరిశోధనల్లో మహిళా శక్తిని చాటిచెప్పేలా ’స్పేస్ కిడ్జ్ ఇండియా’ ప్రతిష్టాత్మకంగా ’మిషన్ శక్తిశాట్’ను చేపట్టిందన్నారు. ఢిల్లీలో జరిగిన మహిళా సాధికారత సదస్సులో మాజీ కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి, బ్రిక్స్ ఛాపంబర్ ఆఫ కామర్స్ అధ్యక్షురాలు రూబీ సిన్నాహలు ఈ మస్కట్ను ఆవిష్కరించారని గురువారం చైన్నెలో ప్రకటించారు.
మస్కట్ ప్రత్యేకత
’శక్తి’ అని పిలిచే ఈ మస్కట్ చొక్కాపై 108 దేశాల జాతీయ జెండాలు ఉన్నాయని వివరించారు.. ‘వసుధైవ కుటుంబకం‘ (ప్రపంచమంతా ఒకే కుటుంబం) అనే భారతీయ తత్వాన్ని చాటిచెప్పేలా ఈ మస్కట్ను చంద్రుడిపైకి పంపనున్నామన్నారు.. దీనిని తాను రూపొందించినట్టు పేర్కొన్నారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి అంతర్జాతీయ బాలికల లూనార్ మిషన్ అని, దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది బాలికలకు శాటిలైట్ ఇంజనీరింగ్, కోడింగ్, స్పేస్ టెక్నాలజీలో శిక్షణ ఇస్తున్నట్టు వివరించారు. భూ కక్ష్యలోకి ఒక ఉపగ్రహాన్ని పంపడంతో పాటు, చంద్రుడిపై ’హార్డ్ ల్యాండింగ్’ అయ్యేలా ఒక లూనార్ శాటిలైట్ను రూపొందించడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. ఎంపికై న విదేశీ విద్యార్థినులు ఈ ఏడాది ఆగస్టులో భారత్కు చేరుకుని, శాటిలైట్ పేలోడ్ ఇంటిగ్రేషన్ పరీక్షల్లో ప్రత్యక్షంగా పాల్గొంటారన్నారు. గతంలో 750 మంది గ్రామీణ భారతీయ బాలికలతో ’ఆజాదీశాట్’ ను విజయవంతంగా ప్రయోగించిన అనుభవంతో, తాజాగా ఈ నమూనాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నామన్నారు. ‘ప్రపంచంలోని ఏ మూలలో ఉన్న బాలిక అయినా అంతరిక్ష శాస్త్రంలో రాణించగలదని నిరూపించడమే లక్ష్యం అని, ఈ మస్కట్ కేవలం ఒక బొమ్మ కాదని, అది ఒక ఉద్యమం. దేశాల మధ్య పోటీ కంటే సహకారం ముఖ్యం అని ఇది చాటి చెబుతుందన్నారు.


