తమిళసినిమా: నార్వే ప్రొడక్షనన్స్ పతాకంపై అరుణ్ రంగరాజు నిర్మించిన చిత్రం కార్మేని సెల్వమ్. నటుడు, దర్శకుడు సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన ఇందులో దర్శకుడు గౌతమ్ మీనన్, లక్ష్మి ప్రియ,అభినయ, కార్తీక్ కుమార్,భడవా గోపి, మధుమిత, అర్జనన్, శంకరనారాయణ, వి.హరిత పరకోడ్ కోదండం, కిరణ్ చక్రవర్తి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రామ్ చక్రి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రానికి మ్యూజిక్లౌడ్ స్టూడియో సంగీతాన్ని అందించింది. కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 3వ వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం మధ్యాహ్నం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సముద్రఖని మాట్లాడుతూ భగవంతుని కృప కారణంగా ఈ చిత్రంలో నటించే అవకాశం తనకు వచ్చిందన్నారు. దర్శకుడు రామ్ చక్రి కథ స్క్రిప్ట్ పంపాలన్నారు. కథను చదవగానే నచ్చిందని, ఎప్పుడు చేద్దాం చెప్పండి అని అన్నానన్నారు. తాను విషయం గురించి ఆలోచించ కుండా పనిలో దిగుతానని, దర్శకుడు అలా కాదని ప్రతి ఆ విషయం గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.మనిషి సంతోషంగా జీవిస్తే చాలు, ధనవంతుడు కావలసిన అవసరం లేదు అని చక్కని సందేశంతో కూడిన కథా చిత్రం ఇదని చెప్పారు.మనం లేకపోయినా, పది కాలాల పాటూ గుర్తుండి పోయే చిత్రం కార్మేని సెల్వమ్ అని పేర్కొన్నారు. చిత్రంలో పని చేసిన నటీనటులు, సాంకేతిక వర్గం అంతా సమష్టిగా శ్రమించారని సముద్రఖని పేర్కొన్నారు.


