సేలం: సేలం సమీపంలో శుక్రవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ప్రభుత్వ బస్సు ఎదురుగా వ్యాన్ను, ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందారు. ఈరోడ్ నుంచి 30 మంది ప్రయాణికులతో శుక్రవారం ఉదయం సేలంకు ప్రభుత్వ బస్సు బయలుదేరింది. మార్గమధ్యంలోని ఉత్తమచోళాపురం వద్ద బ్రైక్ ఫెయిల్ కావడం బస్సు అదుపుతప్పింది. అతి వేగం కారణంగా బస్సును డ్రైవర్ నియంత్రించలేక డివైడర్ దాటి అవతలి వైపు రోడ్డులోకి దూసుకెళ్లింది. అటు వైపుగా వస్తున్ను మినీ సరుకుల వాహనాన్ని, ద్విచక్ర వాహనాన్ని ఢీకొని ఆగింది.
నిర్లక్ష్యం చంపేసింది!
సమాచారం తెలిసి సేలం జిల్లా కలెక్టర్ బృందాదేవి, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ సుబ్రమణ్య బాలచంద్ర సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం సేలం ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులో చికిత్స పొందుతున్న 20 మందికి పైగా గాయపడిన వారిని పరామర్శించారు. రాష్ట్ర రవాణా సంస్థ డ్రైవర్, సేలం జిల్లాలోని మెట్టూరు సమీపంలోని పనంగాడు ప్రాంతానికి చెందిన అయ్యాదురై (49) నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ విషయంగా కొండలంబట్టి పోలీస్ స్టేషన్ పోలీసులు డ్రైవర్ అయ్యాదురైని అరెస్టు చేశారు. సేలం ప్రాంతీయ రవాణా అధికారి రాజపాండియన్ నేతృత్వంలో ప్రాంతీయ రవాణా శాఖ అధికారులు ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.
30 మందికి స్వల్ప గాయాలు
బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆగ్రహించిన స్థానికులు ప్రభుత్వ బస్సుపై రాళ్లతో దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో సేలం – కోయంబత్తూర్ జాతీయ రహదారిపై ఎక్కడి వాహనాలు అక్కడే ఆగాయి. కొండలాంపట్టి పోలీసులు రంగంలోకి దిగి స్థానికులను శాంతింపజేశారు. ప్రమాదంలో మరణించిన వారి మృత దేహాలను పోస్టుమార్టానికి తరలించారు.
సంఘటన స్థలం వద్ద కలెక్టర్


