సాక్షి, చైన్నె: అన్నాడీఎంకేను నమ్మితే తమిళనాడు ప్రజలు ఢిల్లీకి మోకరిల్లాల్సిన పరిస్థితి తప్పదేమో అన్న ఆందోలన కలుగుతోందని డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. సీట్ల సర్దుబాటు కోసం అన్నాడీఎంకే వర్గాలు ఢిల్లీకి పరుగులు తీస్తుండడం బట్టి చూస్తుంటే, ఈ రాష్ట్రాన్ని వారికి తాకట్టు పెట్టేస్తారేమో అన్న ఆందోళన కలుగుతోందని పేర్కొంటూ కేడర్కు శుక్రవారం లేఖ రాశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామి పదేపదే ఢిల్లీ పర్యటనపై ఆయన స్పందించారు. సీట్ల సర్దుబాటు కోసం అమిత్షా ఇంటి ముందు పడిగాపులు కాయాల్సిన పరిస్థితుల్లో ఉన్న అన్నాడీఎంకే బానిసత్వానికి నిదర్శనం తాజా పరిణామాలు అని ఎద్దేవా చేశారు. వీరి కారణంగా రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయని, ఈ దృష్ట్యా, ప్రజలు వారిని నమ్మకుండా, వారి కుట్రలు, కుతంత్రాలు, వారి అసమర్థత గురించి ప్రజలకు వివరించాలని కేడర్ను కోరారు. మంత్రి నెహ్రూ స్పందిస్తూ, ఢిల్లీలో అమిత్ షాతో భేటీ కోసం పళనిస్వామి వెళ్లడం చూస్తుంటే అయ్యా సినిమాలో నటుడు వడివేలు కామెడీ సీన్ గుర్తుకు వస్తోందని విమర్శించారు. ఇంట్లో తన్నులు తిని బయటకు వచ్చి ఈ డీలింగ్ మన మధ్యే ఉండనివ్వండి‘ అని చెప్పే డైలాగ్ పళనిస్వామికి సరిగ్గా సరిపోతుందని ఎద్దేవా చేశారు.
తమిళనాడులో ఎన్డీయే కూటమికి ఏఐఏడీఎంకే నాయకత్వం వహిస్తుందని చెప్పినప్పుడు, సీట్ల చర్చలు ఆ పార్టీ కార్యాలయం (ఎంజీఆర్ మాళిగై)లో జరగాలి కానీ అమిత్ షా ఇంట్లో ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. సొంత పార్టీ కార్యాలయంలో చర్చలు జరిపే ధైర్యం కూడా పళనిస్వామికి లేదని విమర్శించారు.


